న్యూఢిల్లీ: పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించనున్నారు. గుజరాత్తోపాటు డామన్లోనూ మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా ఆయన రూ.22,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. తొలుత సూరత్లో జరిగే భారీ బహిరంగ సభలో రూ.18,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ఆరంభిస్తారు.
వడోదర– ముంబై ఎక్స్ప్రెస్వేలోని ఆరో, ఏడో ప్యాకేజీ పనులను ప్రధాని మొదలెడతారు. గుజరాత్, మహారాష్ట్ర మధ్య రవాణాను వేగవంతంచేయంతోపాటు ఆర్థిక అనుసంధానతే లక్ష్యంగా ఈ ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తున్నారు. తర్వాత సూరత్లో 200 పడకల ఈఎస్ఐసీ వారి ఆస్పత్రిని, డామన్లో నమో ఎయిర్పోర్ట్ కొత్త టర్మినల్ భవంతిని మోదీ ప్రారంభిస్తారు. ఇక్కడే మరో హెల్త్కేర్ కేంద్రాన్ని ఆయన ఆరంభిస్తారు.
హజీరా ప్రాంతంలో కొనసాగుతున్న పరిశ్రమల కార్యకలాపాలను పర్యవేక్షించడంతోపాటు మౌలిక వసతులపై ఆయన సమీక్ష జరపనున్నారు. డామన్లో మొత్తంగా రూ.2,907 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. లక్షద్విప్ కేంద్రపాలిత పాలిత ప్రాంతంలో రూ.885 కోట్ల విలువైన నాలుగు కీలక ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. కాల్పెనీ ద్వీపం, కడ్మాట్ ద్వీపాల మధ్య తూర్పు, పశ్చిమాల వైపు నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులను మోదీ శంకుస్థాపన చేయనున్నారు.


