
కెనడాలో జీ7 సదస్సుకు హాజరు
సైప్రస్, క్రొయేషియాల్లోనూ పర్యటించనున్న ప్రధాని
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి విదేశాలకు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగే కెనడాతో పాటు సైప్రస్, క్రొయేషియాల్లో ఆయన పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు, జూన్ 16, 17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్లో జరిగే జీ7 సమావేశంలో మోదీ పాల్గొంటారు.
ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలతో సహా కీలక ప్రపంచ సమస్యలపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలతో ఆయన పంచుకోనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. అందేగాక పలువురు జీ7, ఇతర దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు. పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ తరువాత ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన. ఖలిస్తానీ సమస్య కారణంగా కెనడాతో దౌత్య సంబంధాలు క్షీణించాక ఆ దేశంలో పర్యటిస్తుండటమూ ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దౌత్య బంధాలు మెరుగవుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇటీవలే చెప్పారు.
2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య జరగడం తెలిసిందే. అందులో భారత ఏజెంట్ల ప్రమేయముందని నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేగాక అప్పటి భారత హై కమిషనర్ సంజయ్ వర్మతో సహా అనేక మంది మన దౌత్యవేత్తలకు నిజ్జర్ హత్యతో సంబంధముందని కూడా కెనడా ఆరోపించింది. వీటిపై భారత్ మండిపడింది. ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఉదంతంతో కెనడాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తర్వాత ట్రూడో తప్పుకోవడం, ఇటీవలి ఎన్నికల్లో మార్క్ కార్నీ ప్రధాని కావడంతో కొన్ని నెలలుగా, అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కొత్త హైకమిషనర్లను నియమించే అవకాశాలను రెండు దేశాలూ పరిశీలిస్తున్నాయి.
భారత్కు ప్రాధాన్యం
భారత్ జీ7 సభ్య దేశం కాకపోయినా ఆహ్వానిత దేశంగా 12వసారి పాల్గొంటోంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతుండటం ఇది వరుసగా ఆరోసారి. 1975లో ఫ్రాన్స్ ప్రారంభించిన జీ7కు ఇది 50వ సంవత్సరం. ఫ్రాన్స్తో పాటు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఇందులో సభ్య దేశాలు. యూరోపియన్ యూనియన్ కూడా జీ7కు పూర్తిస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులు, దేశాల నడుమ సహకారం, అంతర్జాతీయ నేరాల కట్టడికి ఉమ్మడి చర్యలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, యువత, ఉపాధి అవకాశాలు తదితరాలపై జీ7 దృష్టి సారిస్తుంది. భారత్ వంటి దేశాలను ‘ప్రచార భాగస్వామి’గా జీ7 ఏటా ఆహ్వానిస్తోంది.
సైప్రస్, క్రొయేషియాలకు తొలిసారి
మోదీ ఆదివారం తొలుత సైప్రస్ వెళ్తారు. అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్తో పలు అంశాలపై చర్చిస్తారు. గత 20 ఏళ్లలో అక్కడ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం మోదీ కెనడాలో జీ7 సదస్సులో పాల్గొంటారు. అనంతరం 18న క్రొయేషియా వెళ్తారు. భారత ప్రధాని ఒకరు ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. క్రొయేషియా ప్రధాని ఆంద్రే ప్లెంకోవిక్తో పాటు అధ్యక్షుడు జొరాన్ మిలానోవిక్తో కూడా మోదీ భేటీ అవుతారు.