ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం | Over 300 Flights Delayed At Delhi Airport Amid Heavy Smog | Sakshi
Sakshi News home page

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం

Nov 14 2024 3:07 PM | Updated on Nov 14 2024 6:10 PM

Over 300 Flights Delayed At Delhi Airport Amid Heavy Smog

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు యమన నదిలో విషపునురగతో దేశ రాజధాని సతమతమవుతోంది. రెండు రోజులుగా తీవ్రమైన కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. గురువారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం  రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ ఏకంగా 500 స్థాయికి దగ్గరవుతుంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 473గా నమోదైంది.  ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దాంతో రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులుపడ్డారు.

దేశ రాజధానిలో కాలుష్యం పెరిగి, దట్టమైన పొగ కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గింది. ఇది విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌ పోర్ట్‌కు రాకపోకలు సాగించే సుమారు 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్‌ రాడార్‌ 24 సంస్థ తెలిపింది. 

వీటిలో 115 విమానాలు ఢిల్లీకి వచ్చేవి ఉండగా.. రాజధాని నుంచి బయలు దేరాల్సిన 226 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొంది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. సగటున 17 నుంచి 54 నిమిషాలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ పొగమంచు రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం

Advertisement
 
Advertisement
Advertisement