
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనలివ్వాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ కమిటీ ప్రజలను కోరింది. దేశంలో లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి చట్ట పరమైన పరిపాలనా ఫ్రేమ్వర్క్లో చేపట్టాల్సిన మార్పులను తెలపాలని పిలుపునిచ్చింది.
జనవరి 15వ తేదీలోగా అందిన సూచనలను పరిశీలనకు పరిగణిస్తామని ఒక నోటీసులో తెలిపింది. సూచనలను onoe.gov.in వెబ్సైట్లో పోస్టు చేయాలని సూచించింది. లేదా sc& hlc@gov.in కి మెయిల్ చేయవచ్చని వివరించింది. ఈ నోటీసును ఆరు జాతీయ పార్టీలకు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు పంపినట్లు తెలిపింది. ఇదే అంశంపై లా కమిషన్ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామంది.