
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్లు మేఘాలయలో అదృశ్యమైన తరువాత ఈ ఉదంతం పలు మలుపులు తిరిగింది. ఈ ఘటనలో రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఇందుకోసం సోనమ్ తన ప్రేమికునితోపాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించిందని తెలియవచ్చింది. పోలీసుల విచారణలో ఈ నిందితులు సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహా స్నేహితులని వెల్లడయ్యింది.
ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ, ఆమె ప్రేమికుడు కుష్వాహా అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. విచారణ అనంతరం పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను ఆనంద్ కుమ్రీ, ఆకాష్ రాజ్పుత్ విక్కీ ఠాకూర్గా పోలీసులు గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్కు చెందినవారని అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని బినా జిల్లాలో ఆనంద్ కుమ్రీ (23ని అరెస్టు చేయగా, లలిత్పూర్ జిల్లాలో ఆకాష్ రాజ్పుత్ (19)ను అరెస్టు చేశారు. విక్కీ ఠాకూర్ (22)ను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్టు చేశారు. రాజా , సోనమ్లకు మే 11న ఇండోర్లో వివాహం జరిగిన తర్వాత వారు మే 20న మేఘాలయకు బయలుదేరారు. ఒక పర్యాటక ప్రదేశానికి వెళుతుండగా అదృశ్యమయ్యారు.
మే 16న రాజ్ కుష్వాహా.. రాజా రఘువంశీని హత్య చేసేందుకు తన చిన్ననాటి స్నేహితులను ఇండోర్లోని ఒక కేఫ్లో కలిశాడని పోలీసు అధికారులు తెలిపారు. మే 20న సోనమ్, ఆమె భర్త హనీమూన్కు వెళ్లగా, రాజ్ తన ముగ్గురు స్నేహితులను మేఘాలయకు పంపాడు. హత్య జరిగిన రోజున సోనమ్ తన భర్తను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ ఆ ముగ్గురు నిందితులు రాజా రఘువంశీపై దాడి చేశారు. పది రోజుల తర్వాత, పోలీసులకు ఒక లోయలో రాజా మృతదేహం లభ్యమయ్యింది. ఆ సమయంలో ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో అతనిపై రెండుసార్లు దాడి జరిగిందని తేలింది. అదే సమయంలో సోనమ్ కనిపించకుండా తప్పించుకుంది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా శనివారం రాత్రి ఘాజీపూర్లోని ఒక ధాబాలో సోనమ్ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను చికిత్స కోసం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. పోలీసుల విచారణలో ఈ కేసులోని పూర్వాపరాలన్నీ బయటపడ్డాయి.
ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్