
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు ఎటువంటి టోల్ చార్జీలను తాము విధించడం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేసింది. జూలై 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టూ వీలర్లకు కూడా టోల్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు.
ఇటువంటి కట్టుకథలు, తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరారు. ‘ద్వి చక్రవాహనాలకు టోల్ రుసుము వసూలు ప్రతిపాదనేదీ మా పరిశీలనలో లేదు. అటువంటి యోచన చేయడం లేదు. టూ వీలర్స్కు టోల్ ఛార్జీలంటూ వచ్చేవన్నీ ఫేక్ వార్తలు’ అంటూ ఎన్హెచ్ఏఐ, మంత్రి గడ్కరీ వేర్వేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ఫోర్ వీలర్స్, భారీ వాహనాలకు మాత్రమే టోల్ వసూలు చేస్తున్నారు. ఈ విధానంలో మార్పునకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. దీంతో, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీరును నెటిజన్లు సోషల్ మీడియాలో తప్పుబట్టారు. అసత్యాల ప్రచారంపై ఎన్హెచ్ఏఐ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు స్పష్టతనిచ్చారు.