పార్టీలో మేనల్లుళ్ల పాత్రపై మాయావతి స్పష్టీకరణ
లక్నో: సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులు ఆకాశ్ ఆనంద్, ఇషాన్ ఆనంద్లకు బీఎస్పీలో ఎటువంటి రాజకీయ పదవులు ఇవ్వడం లేదని, ఇది తన అంతిమ నిర్ణయమని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. పార్టీలో కీలక పదవుల నుంచి ఆకాశ్ను తొలగిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన మాయావతి..తాజాగా శనివారం ఈ విషయం తెలిపారు.
2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా పార్టీలో నాయకత్వ సమస్యలున్నాయంటూ వ్యాఖ్యానించిన మాయ కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సోదరుడు ఆనంద్ కుమార్ తన వెంటే ఉంటూ అవసరమైతే ఆయన ఏకైక కుమార్తె దీపికా ఆనంద్ సాయం తీసుకోవచ్చని అన్నారు. తన అంతిమ లక్ష్యం కాన్షీరాం జీ మాదిరిగానే బహుజన్ సమాజ్ కుటుంబ సంక్షేమమేనన్నారు. ఆయన మాదిరిగానే కుటుంబసభ్యులకు, బంధువులు పార్టీలో ఎలాంటి పదవులు కూడా ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.


