చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై డీఎంకే నేత, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే క్యాడర్ అండతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు కనీస కృతజ్ఞత, మర్యాద" లేదంటూ డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మండిపడ్డారు. డీఎంకే ఇకపై కాంగ్రెస్ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు.
"కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి డీఎంకే క్యాడరే కారణం. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారు. కానీ ఈరోజు కొన్ని పదవుల కోసం వారు మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పారిపోయారు. వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు. అతి త్వరలోనే తమిళనాడు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు" అంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. "దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలకు ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని నేను అనుకునేవాడిని. కానీ భారత్లో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇప్పుడు స్పష్టమవుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ను తన భుజాలపై మోశారు" అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. యువతకు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) ఓటర్లకు రాజకీయంగా అవగాహన కల్పించాలని, కుటుంబాలు, తొలిసారి ఓటు వేసే వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలని డీఎంకే యువజన విభాగం కార్యకర్తలను ఉదయనిధి స్టాలిన్ కోరారు.


