
ఇటీవల కాలంలో పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్కు పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి భారత్ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.
అయితే ఫహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్కు భారత్కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్ ఆఫ్ ద డాక్యార్డ్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పని చేస్తేన్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి.. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్ యాదవ్,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
భారత్కు చెందిన ప్రియగా పరిచయమై..
భారత్కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్ మీడియ ద్వారా విశాల్ను ఆకట్టుకుంది. తాను భారత్కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్కు చేరవేసిన విశాల్.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్.
పోలీసులు ఏం చెబుతున్నారంటే..
తొలుత ఫేస్బుక్లో విశాల్కు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ విష్ణు కాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్ సింధూర్ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.