
మాఫియా నేత కొడుకుపై కాల్పులు..
ఇంట్లోనే రిటైర్డు డీజీపీ హత్య
సంచలన నేరాలతో బెంగళూరులో అలజడి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రాష్ట్రంలో, అందులోనూ బెంగళూరు పరిసరాల్లో గత 48 గంటల్లో అనూహ్యమైన నేర సంఘటనలు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ టీవీ చానెళ్లలో చాలా సమయాన్ని ఆక్రమించాయి. దీంతో బెంగళూరు హాట్ హాట్ చర్చల్లో భాగమైంది. సినిమా స్టైల్లో మాఫియా డాన్ కొడుకుపై తుపాకులతో హత్యాయత్నం, ఆ గొడవ సద్దుమణగకముందే ఏకంగా రిటైర్డు డీజీపీ ఇంట్లోనే హత్యకు గురికావడం, అందులోనూ ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అరెస్టు చేయడం హాలీవుడ్ క్రైం స్టోరీలను మించిపోయింది.
రిక్కీ కేసులో ఎవరు సూత్రధారి?
మాజీ మాఫియా డాన్, దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై మీద గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరపడం సంచలనం కలిగిస్తోంది. రిక్కీని మట్టుబెట్టాలని ఫైరింగ్ చేయగా, తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. సిలికాన్ సిటీతో పాటు చుట్టుపక్కల జరుగుతున్న రియల్ ఎస్టేట్ గొడవలు, మాఫియా పోరాటాలు ఈ సంఘటనతో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మొదట రియల్ ఎస్టేట్ నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని అందరూ భావించినప్పటికీ సమయం గడిచేకొద్దీ ముత్తప్ప రై రెండవ భార్య అనురాధపై అనుమానాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాల కథనం.
ముత్తప్పరై ఇద్దరు కుమారులు, రెండవ భార్య అనురాధ పేరున తన ఆస్తులు వీలునామా రాశారు. అనురాధకు ఓ మోస్తరుగా బంగారు ఆభరణాలు, ఒక కారు, పెద్ద మొత్తంలో నగదు, హెచ్డీ కోటలో ఉన్న ఆస్తి, బెంగళూరు సహకార నగరలో ఉన్న ఒక భవంతి రాసిచ్చారు. అయితే ఆస్తిలో తనకు ఇంకా భాగం రావాలని ఆమె కోర్టుకు వెళ్లింది. రిక్కీ, అతని అన్న రాకీతో ఆమెకు గొడవలు కూడా జరిగాయి. అయితే తరువాత రిక్కీ సోదరులు రాజీ చేసుకున్నారు. వారు పరస్పరం హత్యలకు కుట్రలు చేసినట్లు కూడా వార్తలున్నాయి. ఇప్పుడీ హత్యాయత్నంతో అది బహిర్గతమైంది.
రిక్కిరై సెక్యూరిటీ ఏమైంది
రిక్కీ రై మీద హత్యాయత్నం తరువాత అందరిలో అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల వారసుడు, విస్తృతంగా శత్రువులను కలిగిన రిక్కీ రై అంత సులభంగా గన్ షాట్కి ఎలా దొరికాడు? పటిష్టమైన ప్రైవేటు భద్రత ఏమైంది? అనే సందేహాలున్నాయి. రిక్కీ రై సొంతంగా వీవీఐపీకి ఉన్నంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు. గన్లు పట్టుకుని చుట్టూ బాడీగార్డులు ఉంటారు. బాడీ గార్డులు షార్ప్ షూటర్స్ అయి ఉంటారు. రిక్కిరై పై కాల్పులు జరిపిన సమయంలో కారులో ఒకరే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మిగతా ఇద్దరు ఎందుకు లేరనేది సందేహాస్పదమైంది. కాల్పుల వెనుక బయటి శత్రుల కన్నా లోపలి శత్రువులే ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిక్కీకి డిప్యూటీ సీఎం పరామర్శ
రిక్కీ రై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడు ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా పోలీసులు అరెస్టు చేస్తారని రిక్కీకి భరోసా ఇచ్చారు.
రిటైర్డు డీజీపీ విషాదాంతం
యశ్వంతపుర: రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఔట్లోని సొంత భవనంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఈ ఘోరం వెలుగుచూసింది. తానే హత్య చేసినట్లు భార్య పల్లవి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఆమె పోలీసులకు కాల్ చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో ఉన్న పల్లవితో పాటు ఆమె కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. వీరి కుటుంబంలో స్పర్థల గురించి చుట్టుపక్కలవారితో పాటు కొందరు విశ్రాంత పోలీసు అధికారులకు కూడా తెలుసని సమాచారం. తనకు ప్రాణభయం ఉందని ఓంప్రకాశ్ స్నేహితులకు చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్యతో ఆయన సహచర రిటైర్డు ఐపీఎస్లు విచారానికి లోనయ్యారు.