గన్ను స్థానంలో గంజాయి! | Maoists evacuate South Bastar | Sakshi
Sakshi News home page

గన్ను స్థానంలో గంజాయి!

Jul 5 2026 1:50 AM | Updated on Jul 5 2026 1:50 AM

Maoists evacuate South Bastar

దక్షిణ బస్తర్‌ను ఖాళీ చేసిన మావోయిస్టులు 

ఇదే అదనుగా ఏఓబీలో గంజాయి మాఫియా పాగా 

అడ్డుకట్ట వేసేందుకు గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ సిబ్బంది కేటాయింపు?

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒకప్పుడు మావోయిస్టుల ఏలుబడిలో ఉన్న దండకారణ్యం ఇప్పుడు గన్‌ ఫ్రీ జోన్‌గా మారింది. ఈ ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలోగా.. అక్కడ గంజాయి పండించేందుకు అరాచక శక్తులు అడుగులు వేస్తున్నాయి. ఈ శక్తులను అడ్డుకునే దిశగా తెలంగాణ పోలీసులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఆపరేషన్‌ కగార్‌ మొదలయ్యాక మావోయిస్టు పార్టీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో బలహీనం కావడం మొదలైంది. హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత క్రమంగా మావోయిస్టుల పట్టు సడలిపోయింది. పారా మిలిటరీ సాయంతో ప్రభుత్వ దళాలు గ్రామాల్లోకి అడుగు పెడుతున్నాయి. ఆధార్‌ కార్డుల జారీ, రోడ్లు, వంతెన నిర్మాణాలు జరుగుతున్నాయి. అయి తే, ఇక్కడి ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యంగా ఉంది. ఆ తర్వాతే ఉపాధి కల్పన, ఆదాయ వనరుల పెంపునకు అవకాశం ఉంది. ఇదంతా పూర్తయి ఒకప్పుడు జనతన సర్కార్‌ అ«దీనంలో ఉన్న ప్రాంతాల ప్రజల తల సరి ఆదాయం సాధారణ స్థితికి చేరేందుకు సమయం పడుతుంది. ఈలోగా అక్కడ పాగా వేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం నిఘా వర్గాలను కలవరపెడుతోంది. గతంలో ఏఓబీలో ఈ తరహా అనుభవమే ప్రభుత్వాలకు ఎదురుకావడం ప్రస్తుత ఆందోళనకు కారణమవుతోంది. 

గంజాయి అడ్డాగా ఏఓబీ 
పీపుల్స్‌వార్‌ తొలి అడుగులు ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ)లోనే పడ్డాయి. ఇక్కడ క్రమంగా మావోయిస్టు పార్టీ బలహీనం కావడం మొదలయ్యాక అభివృద్ధి కంటే ముందుగా అరాచక శక్తులే అడుగుపెట్టాయి. మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్న కొద్దీ సంఘ విద్రోహ శక్తులు ఏఓబీలోకి చొచ్చుకొచ్చాయి. మల్కన్‌గిరి, కోరాపూర్, రాయగడ జిల్లాల్లోని మారుమూల అటవీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని విస్తారంగా గంజాయి సాగు మొదలుపెట్టారు. ఇక్కడ చేతికి వచ్చే గంజాయిని ఆరంభంలో విశాఖపట్నం నుంచి రైళ్ల ద్వారా బ్యాక్‌ప్యాక్‌ బ్యాగుల్లో రవాణా చేశారు. ఆ తర్వాత ఏకంగా లారీలు, కంటైనర్ల ద్వారా రోడ్డు మార్గం నుంచి టన్నుల కొద్ది గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా తెలంగాణలోకి తీసుకురావడం మొదలైంది. ఎప్పటికప్పుడు పోలీసులు బ్రేక్‌ వేస్తున్నా, రాబోయే రోజుల్లో గంజాయి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో ఆపరేషన్లకు మరింత పదును పెట్టనున్నారు. 

ఇకపై ఉక్కుపాదం 
మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్‌ బలగాలు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) విభాగాలను ఇకపై గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టకు ఉపయోగించాలని తెలంగాణ పోలీసు విభాగం నిర్ణయించింది. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లో 1,200 మంది సిబ్బంది ఉండగా ఇందులో సగం మందిని యాంటీ గంజాయి ఆపరేషన్ల కోసం వినియోగించనున్నారు. గతంలో మావోయిస్టు నెట్‌వర్క్‌లోకి చొచ్చుకుపోయి ఆపరేషన్లు చేసినట్టే ఇకపై గంజాయి ఇన్నర్‌ సర్కిల్‌లోకి దూరాలనేది తెలంగాణ పోలీసుల వ్యూహంగా ఉన్నట్టు సమాచారం. ఏఓబీలో ఉన్న గంజాయి ముఠాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ బస్తర్‌పైనా డేగ కన్ను వేయాలనే యోచనలో తెలంగాణ ఖాకీలు ఉన్నారు. ఈ మేరకు గతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ల తరహాలోనే పొరుగు రాష్ట్రాలతో జాయింట్‌ ఆపరేషన్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement