27న కేరళకు నైరుతి | Monsoon 2025 to reach Kerala by May 27 says IMD | Sakshi
Sakshi News home page

27న కేరళకు నైరుతి

May 11 2025 2:54 AM | Updated on May 11 2025 5:35 AM

Monsoon 2025 to reach Kerala by May 27 says IMD

ఈసారి ముందుగానే పలకరించనున్న రుతుపవనాలు 

భారత వాతావరణ శాఖ అంచనా 

తమ అంచనా నిజమైతే 2009 తర్వాత తొలిసారి మేలోనే రుతు పవనాలు వచ్చినట్లవుతుందని వెల్లడి 

ఈ ఏడాది నైరుతి సీజన్‌లో దేశంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని ఇప్పటికే పేర్కొన్న ఐఎండీ 

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగానే జూన్‌ ఒకటో తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తాయి. అంతకంటే ముందుగా మే 27వ తేదీనే కేరళను తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం తెలిపింది. అదే జరిగితే 2009 తర్వాత మొదటిసారిగా రుతు పవనాలు మేలోనే వచ్చినట్లవుతుందని పేర్కొంది. 2009లో చాలా ముందుగా అంటే మే 23వ తేదీనే భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. సాధారణంగా జూలై 8వ తేదీకల్లా దేశం మొత్తానికి రుతుపవ నాలు వ్యాప్తి చెందుతాయి.

తిరిగి సెప్టెంబరు 17వ తేదీన వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ మొదలై అక్టోబర్‌ 15కల్లా ముగుస్తుంది. గతేడాది మే 30న, అంతకు ముందు 2023లో జూన్‌ 8న కేరళను రుతుపవనాలు తాకాయి. అయితే, రుతు పవనాలు ప్రవేశించడానికి, ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతానికి ఎటువంటి సంబంధం లేదని ఐఎండీ అధికారులు తెలిపారు.

రుతుపవనాలు కేరళలోకి సాధారణం కంటే ముందుగా గానీ లేక ఆలస్యంగా గానీ తాకాయంటే దేశవ్యాప్తంగా అవి విస్తరిస్తాయని చెప్పలేమని అన్నారు. స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక పరిస్థితులపై రుతు పవనాల వైఖరి ఆధారపడి ఉంటుందని వివరించారు. 2025 రుతుపవన సీజన్‌లో మొత్తమ్మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసింది. దేశంలో వ్యవసాయరంగానికి రుతుపవనాలే కీలకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement