సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి తొలుత భీమవరం చేరుకుంటారు. అక్కడ ఆక్వా రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా ఫీడ్ ధరల విపరీత పెంపు, మార్కెట్లో గిట్టుబాటు ధరల లేమి తదితర కీలక అంశాలపై రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు.
భీమవరం పర్యటన ముగిసిన అనంతరం, మధ్యాహ్నం ఆయన హెలికాప్టర్లో జగ్గంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్తారు.
మంగళవారం కన్నుమూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి జగన్ నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.


