కుషాయిగూడ, జూన్ 29: భువనేశ్వర్ సెంట్రల్ జైలులో ఉన్న సీపీఐ (మావోయిస్టు) కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ రమేశ్ అలియాస్ మహేందర్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. కుడి కాలుకు తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సోమవారం ఆయనను జైలు అధికారులు భువనేశ్వర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాసి శంకర్ దాదాపు 45 ఏళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని గడిపి, మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. 2021లో ఒడిశాలో అరెస్టైన ఆయన అప్పటి నుంచి భువనేశ్వర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గత రెండేళ్లుగా కుడి కాలుకు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న శంకర్కు జైలులోనే చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.
ఇటీవల ఆహారం తీసుకోలేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాలను కోరుతున్నాయి.
అలాగే, శంకర్పై ఉన్న కేసులను ఉపసంహరించుకుని మానవతా దృక్పథంతో విడుదల చేయాలని హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నాయి. శంకర్ ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వాలదే బాధ్యత అని హెచ్చరిస్తున్నాయి.
గమనిక: ఈ కథనంలో ఆరోగ్య పరిస్థితి, కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల డిమాండ్లకు సంబంధించిన వివరాలు, వారి వాదనలు ప్రకటనల ఆధారంగా ఇచ్చాం. సంబంధిత ప్రభుత్వ లేదా జైలు అధికారుల అధికారిక స్పందన రావాల్సి ఉంది.


