కీలక రంగాల్లో, ప్రపంచ వేదికలపై ఎన్నో ఘనతలు సాధించాం
ఈ సంవత్సరం మనకు మహోన్నత విశ్వాసాన్ని ఇచ్చింది
‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ స్పషీ్టకరణ
న్యూఢిల్లీ: 2025వ సంవత్సరంలో మన దేశానికి గర్వకారణమైన మైలురాళ్లు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జాతీయ భద్రత, క్రీడలు, నూతన శాస్త్రీయ ఆవిష్కరణలతోపాటు ప్రపంచంలో అతిపెద్ద వేదికలపై ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. భారతదేశ ప్రభావం, కీర్తిప్రతిష్టలు అంతటా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు.
2025లో ఇదే చివరి మన్ కీ బాత్. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక అని స్పష్టంచేశారు. దేశ భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు ఇచ్చామని వివరించారు. నూతన భారతదేశం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసొచ్చాయని అన్నారు. దేశ భద్రత పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రతి ఒక్కరూ మాతృభూమి పట్ల ప్రేమ, ఆరాధనతోపాటు భావోద్వేగాలు, కృతజ్ఞతలను విభిన్న రూపాల్లో వ్యక్తం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు.
చిరస్మరణీయమైన సంవత్సరం
‘‘ఆపరేషన్ సిందూర్ నాటి అదే స్ఫూర్తి వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగానూ ప్రజల్లో కనిపించింది. నా పిలుపునకు వారు ఉత్సాహంగా స్పందించారు. జాతీయ గీతం 150 ఏళ్ల వేడుకలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో సందేశాలు పంచుకున్నారు. క్రీడల విషయంలో 2025 మనకు చిరస్మరణీయమైన సంవత్సరం. పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించింది. మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. అంధుల టీ20 ప్రపంచ కప్లో మన మహిళల జట్టు విజేతగా నిలిచి, చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టీ20 , పారా అథ్లెటిక్స్లో మన క్రీడాకారులు అద్భుతమైన విజయాలు సాధించారు. మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించారు.
కన్నడనాడు, నుడి నమ్మ హెమ్మే
భారతీయ భాషలు, సం్కృతి ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దేశంలో తమిళ భాషకు ప్రాచుర్యం లభిస్తోంది. కొత్త తరాన్ని ఈ భాషతో అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్లో నివసించే కన్నడ కుటుంబాలు కన్నడ పాఠశాలను ప్రారంభించాయి. పిల్లలకు కన్నడ భాష నేరి్పస్తున్నాయి. కన్నడనాడు, నుడి నమ్మ హెమ్మే(కన్నడ భూమి, కన్నడ భాష మనకు గర్వకారణం). జమ్మూకశీ్మర్లోని బారాముల్లాకు సంబంధించిన మూడు బౌద్ధ స్తూపాల పాత ఫోటో ఒకటి ఫ్రాన్స్ మ్యూజియంలో కనిపించింది. కశీ్మర్కు రెండు వేల ఏళ్ల మహోన్నత చరిత్ర ఉంది. పురాతన కాలం నాటి మానవ నిర్మిత కట్టడాలు, వస్తువులు అక్కడ లభ్యమయ్యాయి. కశీ్మర్ గత వైభవాన్ని అవి మనకు తెలియజేస్తున్నాయి.
మనసుంటే మార్గం ఉంటుంది
మణిపూర్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల శ్రీరామ్ మొయిరంగ్థెమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతడు తన గ్రామానికి విద్యుత్ను తీసుకొచ్చాడు. సౌర విద్యుత్తో వందలాది ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాడు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి నిరూపించాడు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కలి్పంచాడు. దాంతో అక్కడ నిరంతరాయంగా విద్యుత్ అందుతోంది. ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.80 వేల చొప్పున అందజేస్తోంది. అర్హులైన ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి.
వైద్యుల సలహాతోనే మాత్రలు
యాంటీబయోటిక్స్తోపాటు పలు రకాల ఔషధాలను జనం విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం ప్రమాదకరమే. డాక్టర్ను సంప్రదించకుండా సొంతంగా ఔషధాలు తీసుకోవద్దు. న్యుమోనియా, యూటీఐ వంటి వ్యాధులపై యాంటీబయోటిక్స్ ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఇటీవల ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. అంటే మనలో యాంటీబయోటిక్స్ నిరోధకత వచ్చేసింది. ఇది ఆందోళనకరమైన విషయం. ఇకనైనా పరిస్థితి మారాలి. ఒక మాత్ర వేసుకుంటే అన్ని రోగాలూ పోతాయని అనుకోవడం సరైంది కాదు. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే వైద్యుల సలహాతోనే మాత్రలు వేసుకోవాలి.
భారత యువశక్తికి తిరుగులేదు
సైన్స్, అంతరిక్ష రంగంలో గొప్ప ముందడుగు వేశాం. మన వ్యోమగామి శుభాంశు బుక్లా అంర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతగా వెళ్లొచ్చాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు గొప్ప ఆశతో చూస్తోంది. మన యువజన బలమే ఇందుకు కారణం. భారత యువశక్తికి తిరుగులేదు. సైన్స్, నవీన ఆవిష్కరణలు, టెక్నాలజీ విస్తరణలో మన విజయాలను ప్రపంచదేశాలు అబ్బురంగా వీక్షిస్తున్నాయి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘యంగ్ లీడర్స్ డైలాగ్’ నిర్వహిస్తున్నాం.
నేను పాల్గొనే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మారాలని యువతను కోరుతున్నా. కొత్త ఆవిష్కరణలు, ఫిట్నెస్, స్టార్టప్స్, వ్యవసాయం వంటి అంశాలపై వారు తమ ఆలోచనలు పంచుకోవచ్చు. శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆసక్తులను ప్రదర్శించడానికి ఇప్పటి యువతకు ఎన్నో అవకాశాలు, వేదికలు ఉన్నాయి. అలాంటి ఒక వేదిక ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’. ఈ ఎనిమిదేళ్లలో 13 లక్షల మంది విద్యార్థులు ఈ హ్యాక్థాన్లో పాల్గొన్నారు. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై యువత దృష్టిపెట్టడం నిజంగా హర్షణీయం
స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ప్రశంసనీయం
ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ప్రజల విశ్వాసం, సంస్కృతి, విశిష్టమైన భారతీయ వారసత్వం ఒకే వేదికపైకి చేరాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాను చూసి ప్రపంచం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. అయోధ్య భవ్య రామమందిరంపై ధ్వజరోహణాన్ని చూసి ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. అలాగే స్వదేశీ ఉత్పత్తులకు ప్రజలు పెద్దపీట వేస్తుండడం ప్రశంసనీయం. భారతీయుల స్వేదం, భారతీయ మట్టి పరిమళం కలగలిసిన ఈ ఉత్పత్తులను విస్తృతంగా కొనుగోలు చేసి ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దేశంలో చీతాల సంఖ్య పెరుగుతుండడం సంతోషం కలిగిస్తోంది. ఇప్పుడు 30కిపైగా చీతాలు ఉన్నాయి. 2025వ సంవత్సరం మనకు మహోన్నత విశ్వాసాన్ని ఇచి్చందని చెప్పగలం. నూతన ఆశయాలు, సంకల్పాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి దేశం సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: 2026కు 26 ట్రెండ్స్.. ఏఐ నుంచి జీరో వేస్ట్ వరకూ..


