
హర్దోయ్: వివాహమైన తరువాత ఏర్పడే అక్రమ సంబంధాలు ఎటువంటి పరిస్థితులకైనా దారి తీస్తుంటాయి. భార్యాభర్తలలో ఏ ఒక్కరు దారితప్పి నడిచినా, వారి మధ్య కలహాలు ఏర్పడుతుంటాయి. యూపీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ పరిధిలో గల ఒక గ్రామానికి చెందిన రామ్ ఖిలావన్ తన భార్యను ఆమె ప్రియునితో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. తరువాత ఆగ్రహంతో ఆమె ముక్కును బలంగా కొరికివేశాడని హరియావన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనకు ముందు భార్యాభర్తల మధ్య తీవ్రవాగ్వాదం జరిగిందని, ఆమె ప్రియుని ముందు భర్త ఆమె ముక్కును కొరికాడని పోలీసులు తెలిపారు.
ఆమె రోదనలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన మహిళను హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు లక్నోలోని వైద్య కేంద్రానికి తరలించారు. ఈ కేసులో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్ తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉద్రిక్తతల వేళ.. ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు