
బాధ్యతల్ని విస్మరించిన వాళ్లు రిటైరైతే మంచిది: ఖర్గే
ఏఐసీసీ వేదికగా నేతలకు హెచ్చరికలు
అహ్మదాబాద్: అత్యంత కీలకమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) జాతీయ సమావేశం వేళ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతూ పనిచేయని నేతలు పక్కకు తప్పుకోవాలని హితవు పలికారు. అప్పగించిన బాధ్యతలను విస్మరిస్తున్న నేతలు రాజకీయ సన్యాసం చేయాలని కటువుగా మాట్లాడారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతీ నదీ తీరంలో బుధవారం జరిగిన 84వ ఏఐసీసీ జాతీయ సమావేశంలో ఖర్గే సుదీర్ఘ ప్రారంభోపన్యాసం చేశారు.
పార్టీకి సాయపడకపోతే తప్పుకోండి
‘‘పార్టీకి ఉపయోగపడని నేతలు తప్పుకోవాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. పదవుల్లో అలంకారప్రాయంగా తిష్టవేసిన నేతలు రాజకీయ సన్యాసం చేయాలి. పార్టీని బలోపేతం చేయడంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలది ఇకపై అత్యంత క్రియాశీలక పాత్ర. డీసీసీ అధ్యక్షులకు అదనపు అధికారాలను కట్టబెడతాం. కొత్త డీసీసీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది.
జిల్లా అధ్యక్షుడు అత్యంత ప్రతిభావంతులైన నేతలతో బూత్ కమిటీ, మండల్ కమిటీ, బ్లాక్ కమిటీ, జిల్లా కమిటీలను ఎన్నుకోవాలి. ఈ ప్రక్రియలో వివక్షకు తావులేదు. అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో జిల్లా అధ్యక్షులనూ భాగస్వాములను చేస్తాం’’ అని అన్నారు. ‘‘ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ఇలాగే అక్రమంగా గెలిచింది. అందుకే మళ్లీ బ్యాలెట్ పేపర్కు మారడం ఉత్తమం. పార్టీలు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను ఎత్తిచూపితే వాటిని ఆపాల్సిన ఎన్నికల సంఘం ఆ పార్టీలనే తప్పుబడుతోంది.
500 ఏళ్లనాటి పాత విషయాలను తవి్వతీసి మతవిద్వేషాలను బీజేపీ ప్రభుత్వం రాజేస్తోంది’’ అన్నారు. ‘‘మరో స్వాత్రంత్య్ర పోరాటానికి వేళైంది. అన్యాయం, అసమానత, వివక్ష, పేదరికం, మతతత్వం అనే శత్రువుల చెర నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకొద్దాం. గతంలో విదేశీపాలకులు ఈ అన్యాయం, అసమానత, వివక్షలను ఎగదోస్తే ఇప్పుడు సొంత(బీజేపీ) ప్రభుత్వమే ఈ దారుణాలకు ఒడిగడుతోంది. నాడు విదేశీయులు మతతత్వాన్ని అనుకూలంగా మల్చుకున్నారు. ఇప్పటి(బీజేపీ) ప్రభుత్వాలూ అదే పనిచేస్తున్నాయి. నాడు గెలిచాం. నేడూ గెలిచి తీరతాం’’ అని ఖర్గే అన్నారు.
ప్రైవేటీకరణపై..
‘‘మోదీ సర్కార్ ఇటీవలికాలంలో అవకాశం చిక్కిన ప్రతిసారీ కొత్త నినాదం ఇస్తోంది. ప్రజల దృష్టి మరల్చడమే వాళ్ల అసలు ఉద్దేశం. ప్రజాస్వామ్యాన్ని చాలా నెమ్మది నెమ్మదిగా అంతంచేస్తున్నారు. దేశ సంపదను కొద్దిమంది బడా వ్యాపారవేత్తలకే ధారాదత్తం చేస్తున్నారు. మొత్తం ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను నిరుపయోగంగా మారుస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం, మోదీ కలసి ఏకంగా దేశాన్నే అమ్మేయడం ఖాయం. లోక్సభలో విపక్షనేతకే పార్లమెంట్లో మాట్లాడే అవకాశం దక్కకపోతే ఇక ప్రజల వాణి ఎలా పార్లమెంట్లో ప్రతిధ్వనించగలదు?’’ అని లోక్సభ స్పీకర్ను పరోక్షంగా ఖర్గే విమర్శించారు.
తొలిసారిగా ‘గుజరాత్’ తీర్మానం
సాధారణంగా ఏఐసీసీ సమావేశంలో జాతీయ అంశాలపై కాంగ్రెస్ నేతలు తీర్మానాలు చేస్తారు. కానీ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రం(గుజరాత్)ను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక తీర్మానం చేయడం గమనార్హం. గుజరాత్లో దాదాపు 30 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పునర్వైభవమే లక్ష్యంగా ‘‘ గుజరాత్లో కాంగ్రెస్ ఎందుకు ఆవశ్యమంటే?’ పేరిట ఈ తీర్మానం చేశారు.
‘నూతన గుజరాత్, నూతన కాంగ్రెస్’ నినాదంతో ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీకి గెలిపిస్తే గుజరాత్లో సామాజిక న్యాయమే ధ్యేయంగా దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మైనారిటీల్లో కులగణన చేపడతామని పార్టీ హామీ ఇచ్చింది. న్యాయపథ్ పేరిట మరో కీలక తీర్మానాన్నీ పార్టీ ఆమోదించింది. ‘‘ ప్రజలందరి ఐక్యత సాధనే కాంగ్రెస్ జాతీయత. ప్రభుత్వం ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ వర్గాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేయడంతోపాటు ఘోర నేరానికి పాల్పడుతోంది’’ అని తీర్మానించారు.
క్రైస్తవులు, సిక్కుల హక్కులనూ హరిస్తారు: రాహుల్
సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడారు. ‘‘ వక్ఫ్ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. మతస్వేచ్ఛపై దాడి ఇది. బీజేపీ–ఆర్ఎస్ఎస్లు త్వరలోనే క్రైస్తవులు, సిక్కుల మత హక్కులనూ హరించబోతున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ మేగజైన్లో వ్యాసం చదివితే మీకూ ఈ విషయం అర్థమవుతుంది. ట్రంప్ సృష్టించిన సుంకాల సునామీ భారత్ను చుట్టేయనుంది. వైట్హౌస్లో మోదీ, ట్రంప్ ఫొటో సెషన్ గమనించారా?. ఈసారి ప్రేమగా హత్తుకోవడానికి బదులు సుంకాలతో సరిపెడతానని మోదీ ముఖంమీదే ట్రంప్ చెప్పారు. అయినా మోదీ ఒక్కమాట మాట్లాడలేకపోయారు.
ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ మోదీ ఎదుటే భారత్పై అభాండాలు మోపుతుంటే ప్రధాని నోట మాట రాలేదు. 56 అంగుళాల ఛాతీ ఎటుపోయింది?’’ అని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ పొగిడారు. ‘‘ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచీగా మారింది. ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల ఫలాలు ఇస్తోంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గోడను కేంద్రంలో మేం బద్దలుకొడతాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.