All India Congress Committee
-
పనిచేయండి లేదా వైదొలగండి
అహ్మదాబాద్: అత్యంత కీలకమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) జాతీయ సమావేశం వేళ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతూ పనిచేయని నేతలు పక్కకు తప్పుకోవాలని హితవు పలికారు. అప్పగించిన బాధ్యతలను విస్మరిస్తున్న నేతలు రాజకీయ సన్యాసం చేయాలని కటువుగా మాట్లాడారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతీ నదీ తీరంలో బుధవారం జరిగిన 84వ ఏఐసీసీ జాతీయ సమావేశంలో ఖర్గే సుదీర్ఘ ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీకి సాయపడకపోతే తప్పుకోండి ‘‘పార్టీకి ఉపయోగపడని నేతలు తప్పుకోవాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. పదవుల్లో అలంకారప్రాయంగా తిష్టవేసిన నేతలు రాజకీయ సన్యాసం చేయాలి. పార్టీని బలోపేతం చేయడంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలది ఇకపై అత్యంత క్రియాశీలక పాత్ర. డీసీసీ అధ్యక్షులకు అదనపు అధికారాలను కట్టబెడతాం. కొత్త డీసీసీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు అత్యంత ప్రతిభావంతులైన నేతలతో బూత్ కమిటీ, మండల్ కమిటీ, బ్లాక్ కమిటీ, జిల్లా కమిటీలను ఎన్నుకోవాలి. ఈ ప్రక్రియలో వివక్షకు తావులేదు. అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో జిల్లా అధ్యక్షులనూ భాగస్వాములను చేస్తాం’’ అని అన్నారు. ‘‘ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ఇలాగే అక్రమంగా గెలిచింది. అందుకే మళ్లీ బ్యాలెట్ పేపర్కు మారడం ఉత్తమం. పార్టీలు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను ఎత్తిచూపితే వాటిని ఆపాల్సిన ఎన్నికల సంఘం ఆ పార్టీలనే తప్పుబడుతోంది. 500 ఏళ్లనాటి పాత విషయాలను తవి్వతీసి మతవిద్వేషాలను బీజేపీ ప్రభుత్వం రాజేస్తోంది’’ అన్నారు. ‘‘మరో స్వాత్రంత్య్ర పోరాటానికి వేళైంది. అన్యాయం, అసమానత, వివక్ష, పేదరికం, మతతత్వం అనే శత్రువుల చెర నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకొద్దాం. గతంలో విదేశీపాలకులు ఈ అన్యాయం, అసమానత, వివక్షలను ఎగదోస్తే ఇప్పుడు సొంత(బీజేపీ) ప్రభుత్వమే ఈ దారుణాలకు ఒడిగడుతోంది. నాడు విదేశీయులు మతతత్వాన్ని అనుకూలంగా మల్చుకున్నారు. ఇప్పటి(బీజేపీ) ప్రభుత్వాలూ అదే పనిచేస్తున్నాయి. నాడు గెలిచాం. నేడూ గెలిచి తీరతాం’’ అని ఖర్గే అన్నారు. ప్రైవేటీకరణపై.. ‘‘మోదీ సర్కార్ ఇటీవలికాలంలో అవకాశం చిక్కిన ప్రతిసారీ కొత్త నినాదం ఇస్తోంది. ప్రజల దృష్టి మరల్చడమే వాళ్ల అసలు ఉద్దేశం. ప్రజాస్వామ్యాన్ని చాలా నెమ్మది నెమ్మదిగా అంతంచేస్తున్నారు. దేశ సంపదను కొద్దిమంది బడా వ్యాపారవేత్తలకే ధారాదత్తం చేస్తున్నారు. మొత్తం ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను నిరుపయోగంగా మారుస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం, మోదీ కలసి ఏకంగా దేశాన్నే అమ్మేయడం ఖాయం. లోక్సభలో విపక్షనేతకే పార్లమెంట్లో మాట్లాడే అవకాశం దక్కకపోతే ఇక ప్రజల వాణి ఎలా పార్లమెంట్లో ప్రతిధ్వనించగలదు?’’ అని లోక్సభ స్పీకర్ను పరోక్షంగా ఖర్గే విమర్శించారు. తొలిసారిగా ‘గుజరాత్’ తీర్మానం సాధారణంగా ఏఐసీసీ సమావేశంలో జాతీయ అంశాలపై కాంగ్రెస్ నేతలు తీర్మానాలు చేస్తారు. కానీ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రం(గుజరాత్)ను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక తీర్మానం చేయడం గమనార్హం. గుజరాత్లో దాదాపు 30 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పునర్వైభవమే లక్ష్యంగా ‘‘ గుజరాత్లో కాంగ్రెస్ ఎందుకు ఆవశ్యమంటే?’ పేరిట ఈ తీర్మానం చేశారు. ‘నూతన గుజరాత్, నూతన కాంగ్రెస్’ నినాదంతో ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీకి గెలిపిస్తే గుజరాత్లో సామాజిక న్యాయమే ధ్యేయంగా దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మైనారిటీల్లో కులగణన చేపడతామని పార్టీ హామీ ఇచ్చింది. న్యాయపథ్ పేరిట మరో కీలక తీర్మానాన్నీ పార్టీ ఆమోదించింది. ‘‘ ప్రజలందరి ఐక్యత సాధనే కాంగ్రెస్ జాతీయత. ప్రభుత్వం ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ వర్గాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేయడంతోపాటు ఘోర నేరానికి పాల్పడుతోంది’’ అని తీర్మానించారు.క్రైస్తవులు, సిక్కుల హక్కులనూ హరిస్తారు: రాహుల్ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడారు. ‘‘ వక్ఫ్ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. మతస్వేచ్ఛపై దాడి ఇది. బీజేపీ–ఆర్ఎస్ఎస్లు త్వరలోనే క్రైస్తవులు, సిక్కుల మత హక్కులనూ హరించబోతున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ మేగజైన్లో వ్యాసం చదివితే మీకూ ఈ విషయం అర్థమవుతుంది. ట్రంప్ సృష్టించిన సుంకాల సునామీ భారత్ను చుట్టేయనుంది. వైట్హౌస్లో మోదీ, ట్రంప్ ఫొటో సెషన్ గమనించారా?. ఈసారి ప్రేమగా హత్తుకోవడానికి బదులు సుంకాలతో సరిపెడతానని మోదీ ముఖంమీదే ట్రంప్ చెప్పారు. అయినా మోదీ ఒక్కమాట మాట్లాడలేకపోయారు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ మోదీ ఎదుటే భారత్పై అభాండాలు మోపుతుంటే ప్రధాని నోట మాట రాలేదు. 56 అంగుళాల ఛాతీ ఎటుపోయింది?’’ అని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ పొగిడారు. ‘‘ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచీగా మారింది. ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల ఫలాలు ఇస్తోంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గోడను కేంద్రంలో మేం బద్దలుకొడతాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు. -
ఏప్రిల్లో ఏఐసీసీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సమావేశాలను ఏప్రిల్ 8, 9వ తేదీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనను ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపింది. కీలకమైన చర్చలకు వేదికగానే కాకుండా, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి, దేశం కోసం బలమైన ప్రత్యామ్నాయ దృక్పథ ఆవిష్కరణకు, పార్టీ సమష్టి సంకల్పానికి పునరుద్ఘాటనగా ఉంటాయని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ సమావేశం దేశ వ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ ప్రతినిధులను ఒకచోట చేర్చి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లను, రాజ్యాంగం, దాని విలువలపై బీజేపీ చేస్తున్న నిరంతర దాడులను చర్చించి, కార్యాచరణను సిద్ధం చేస్తుంది’అని చెప్పారు. 1924 సమావేశంలో మహాత్మాగాంధీ అధ్యక్ష పదవి చేపట్టిన వందేళ్ల వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన తీర్మానాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉంటాయని తెలిపారు. గాం«దీజీ, బీఆర్ అంబేడ్కర్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరాన్ని గుర్తిచేలా సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్రను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాం«దీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్గాం«దీ హాజరవుతారు. -
సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు
-
రాజకీయ వ్యవహారాల ఉపకమిటీలో ఉత్తమ్కు చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వేదికగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) 85 వప్లీనరీ సమావేశాలకు ముసాయిదా కమిటీతోపాటు వివిధ అంశాల్లో ఉపకమిటీలను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా వీరప్పమొయిలీ, కన్వీనర్గా అశోక్ చవాన్తోపాటు 20 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డితోపాటు మాణిక్యం ఠాగూర్కు చోటుకల్పించారు. ముసాయిదా కమిటీ చైర్మన్గా జైరాం రమేశ్, కన్వీనర్గా పవన్ ఖేరాతోపాటు మరో 21 మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఇందులో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితోపాటు సీనియర్ నేత కొప్పుల రాజుకు అవకాశం కల్పించారు. ఆర్థిక వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా చిదంబరం, కన్వీనర్గా గౌరవ్ వల్లబ్తోపాటు 14 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సంజీవరెడ్డి, జేడీ శీలంకు అవకాశం ఇచ్చారు. అంతర్జాతీయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా సల్మాన్ ఖుర్షీద్, కన్వీనర్గా శశిథరూర్తోపాటు 11 మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర మాజీమంత్రి పల్లంరాజుకు ఈ కమిటీలో చోటు కల్పించారు. రైతులు–వ్యవసాయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా భూపేందర్ సింగ్ హుడా, కన్వీనర్గా రఘువీరారెడ్డితోపాటు 14 మంది సభ్యులు ఉన్నారు. సామాజిక న్యాయం సాధికారత వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్గా ముకుల్ వాస్నిక్, కన్వీనర్గా కొప్పుల రాజుతోపాటు 16 మంది సభ్యులు ఉన్నారు. -
ఆజాద్పై వేటు.. ప్రియాంకకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీలను మారుస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అదేవిధంగా ఇటీవల పార్టీపై లేఖాస్త్రం సంధించిన బృందం నాయకుడు గులాం నబీ ఆజాద్ ను సీడబ్ల్యూసీలో కొనసాగిస్తూనే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తప్పించారు. ఆజాద్తో పాటు సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. 22 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయగా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు సహాయపడేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులైన ఆంటోనీ, అహ్మద్ పటేల్ తోపాటు అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలాలకు చోటు కల్పించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి రెగ్యులర్ సభ్యులుగా చిదంబరం, రణ్దీప్ సూర్జేవాలా, తారిఖ్ అన్వర్, జితేంద్ర సింగ్లను తీసుకున్నారు. లుజిన్హొ ఫెలిరియో, మోతీలాల్ వోరా, ఆధిర్ రంజన్ చౌధురి, తామ్రధ్వజ్ సాహులను సీడబ్ల్యూసీ సభ్యత్వం నుంచి తొలగించారు. లిరియోను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. ఆజాద్ను హరియాణా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించి, వివేక్ బన్సాల్ను ఆ పదవిలో నియమించారు. సూర్జేవాలాను కర్నాటకకు, జితిన్ ప్రసాదను పశ్చిమబెంగాల్కు పార్టీ వ్యవహారాల ఇన్చార్జి్జలుగా నియమించారు. కాంగ్రెస్పార్టీలో సంస్కరణలు అవసరమని, క్రియాశీల అధ్యక్షుడి అవసరం పార్టీకి ఉందంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. సీడబ్యూసీ కొత్త సభ్యుల్లో దిగ్విజయ్, రాజీవ్ శుక్లా, మానికం టాగోర్, ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, హెచ్కే పాటిల్, సల్మాన్ ఖుర్షీద్, దినేశ్ గుండూరావు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉమెన్ చాందీని కొనసాగించగా, తెలంగాణ ఇన్చార్జిని మార్చారు. తెలంగాణ ఇన్చార్జిగా కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన విరుధానగర్ ఎంపీ మాణిక్కం టాగూర్ నియమితులయ్యారు. ఇక, సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్, తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ నేత బి.సంజీవరెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం లభించింది. పార్టీ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో మరో ఐదుగురు సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని నియమించారు. -
కాంగ్రెస్ చీఫ్ ‘నాయిని’
డీసీసీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ వరంగల్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాయిని రాజేందర్రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ 17న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడిగా ‘నాయిని’ని నియమించారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం తర్వాత.. నారుుని పింఛన్లు, విద్యుత్ కోతలకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశారు. కీలక నేతలు పార్టీని వీడినా.. పార్టీపై ఆ ప్రభావం పడకుండా చర్యలు చేపట్టారు. అన్నింటి కంటే ముఖ్యంగా గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని సమన్వయంతో నడిపించగలుగుతున్నారు. ఇలా ఎనిమిది నెలలుగా పార్టీకి చేసిన కృషితో రాజేందర్రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ పూర్తిస్థాయి అధ్యక్ష పదవిని తనకు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్గాంధీకి, తన నియామకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. అభినందనల వెల్లువ డీసీసీ పూర్తి అధ్యక్షుడిగా నియమితుడైన నాయిని రాజేందర్రెడ్డికి జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, పీసీపీ మీడియా కన్వీనర్ ఇ.వి.శ్రీనివాసరావు, నాయకులు బిన్ని లక్ష్మణ్, కట్ల శ్రీనివాస్, ధనరాజ్, ప్రదీప్, సాదా శ్రీను, టి.మదు, హరి, నలుబోల రాజు, నెక్కొండ కిషన్, మెడకట్ల సారంగపాణి, బాబురావు, తోట వెంకన్న నాయినిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఏఐసీసీ భేటీకి వెళ్లేవారెందరు?
రాష్ర్టం నుంచి 150 మందికి ఆహ్వానం ఆసక్తి చూపని అత్యధిక సభ్యులు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం గౌరవంగా భావించే కాంగ్రెస్ నేతలు ఈ సారి.. ఆ భేటీలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో వాడి, వేడిగా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ వెళ్లేందుకు నేతలు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఈ నెల 17న న్యూఢిల్లీలో జరగనున్న ఏఐసీసీ సమావేశంలో పలు కీలక ప్రకటనలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఆ భేటీలో పాల్గొనాలంటూ రాష్ట్రం నుంచి మొత్తం 150 మందికి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 76 మంది ఏఐసీసీ సభ్యులు కాగా, మిగిలిన వారు కో-ఆప్షన్, ఎక్స్అఫిషియో సభ్యులు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్స్అఫిషియో సభ్యులుగా పరిగణిస్తారు. మొత్తం సభ్యుల్లో సుమారు 20 మంది సభ్యులు పార్టీని వీడారు. కొందరు సభ్యులు చనిపోయారు. వీరి స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వలేదు. వీరిపోగా మిగిలిన వారిలో దాదాపు సగం మంది సభ్యులు, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత నేతలు ఏఐసీసీ సమావేశాలకు వెళ్లకపోవచ్చని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఎం కూడా డౌటే!: ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కూడా వెళ్లే అవకాశాలు లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నందున ఢిల్లీకి రాలేకపోతున్నానని ఆయన హైకమాండ్కు చెప్పే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం ఈనెల 16 సాయంత్రమే ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ముఖ్య నేతలంతా ఈ సమావేశాలకు వెళ్లాలనే యోచనలోనే ఉన్నారు. శాసనమండలి ఛైర్మన్ డాక్టర్ చక్రపాణి సహా ఏఐసీసీ సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా ఏఐసీసీ సమావేశాలకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉందని పలువురు సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు 17 వ తేదీన శాసనమండలికి సెలవు ప్రకటించగా, ఎవరూ కోరని కారణంగా 17 అసెంబ్లీ కొనసాగించాలనే నిర్ణయించారని పార్టీ నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈనెల 17న జరగబోయే ఏఐసీసీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి రూపొందించిన వినతిపత్రంపై తెలంగాణ, సీమాంధ్రకు చెందిన మంత్రులు సహా సుమారు వందమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేశారు. 17నుంచి అసెంబ్లీ రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో మరో ఆరు రోజులు మాత్రమే చర్చ జరగనుంది. సం క్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 16 తేదీ వరకు అసెంబ్లీకి సెలవులు ప్రకటించగా తిరిగి 17 వ తేదీ శుక్రవారం నుంచి సమావేశాలు ప్రారం భం కానున్నాయి. 17వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరగనుండడం, కీలక నేతలంతా ఆ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆ తేదీన అసెంబ్లీ సమావేశం జరగకపోవచ్చన్న ప్రచారం ఎమ్మెల్యేల్లో సాగింది. అయితే 10వ తేదీన సభను వాయిదా వేస్తూ స్పీకర్ మనోహర్.. అసెంబ్లీ తిరిగి 17 వ తేదీన ప్రారంభమవుతుందని ప్రకటించారు. శాసనమండలి సమావేశాలు మాత్రం 18వ తేదీన పునప్రారంభమవుతాయి. ఈనెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ మలివిడత సమావేశాలు ప్రారంభమై 10వ తేదీతో ముగిశాయి. -
రాజుకుంటోంది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే వార్తల నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గుర్తించేందుకు అధికార పార్టీ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. వీరు మూడు రోజుల పాటు జిల్లా కేంద్రంలో మకాం వేస్తుండటంతో ‘బయోడేటా’లతో ఔత్సాహిక నేతలు సిద్ధమవుతున్నారు. అయితే జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా ఒకటి రెండు రోజుల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ నేతలు విజ్ఞాపనలు సమర్పించనున్నారు. మహారాష్ట్రకు చెందిన శాసన సభ్యులు గడ్డం ఆనందరావు, బస్వరాజ్ పాటిల్లు సభ్యులుగా ఉన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మూడు రోజుల పాటు జిల్లాలో మకాం వేయనుంది. ఈ ఇద్దరు నేతలు సంగారెడ్డి ఐబీ అతిథిగృహం కేంద్రంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేతల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలకులు వినతులు స్వీకరించేలా షెడ్యూలు సిద్ధం చేసినట్లు సమాచారం. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని స్థానాలకు ఆనందరావు, మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని స్థానాలకు బస్వరాజ్ పాటిల్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఔత్సాహిక అభ్యర్థులు పరిశీలకులను కలిసి తమ బలాబలాలు, తాము ఏ రకంగా అర్హులమో వివరించే అవకాశం ఉంది. తమ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పరిశీలకులు హైదరాబాద్లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పరిశీలకులు సమర్పించే నివేదిక ఆధారంగా ఫిబ్రవరి పదో తేదీలోగా అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం ఏఐసీసీ పరిశీలకుడు అమర్ కాలే జిల్లాకు వచ్చిన ఔత్సాహిక నేతల నుంచి విజ్ఞాపనలు స్వీకరించిన విషయం తెలిసిందే. సిట్టింగులున్నా పోటాపోటీ ప్రస్తుతం జహీరాబాద్ లోక్సభ స్థానంతో పాటు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మెదక్లో టీడీపీ, సిద్దిపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వడం కష్టమే అయినా తమ వంతు ప్రయత్నాలు చేసేందుకు కొందరు నేతలు సన్నద్ధమవుతున్నారు. మెదక్, సిద్దిపేటతో పాటు పటాన్చెరు, దుబ్బాకలో ఈ రకమైన ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీసీ కోటాలో నందీశ్వర్కే మరోమారు అవకాశం ఖాయమనే ప్రచారం వినిపిస్తోంది. అయితే డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి భవిష్యత్ ప్రణాళికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దుబ్బాకలో ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఇతర నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసే యోచనలో ఉన్నారు. దుబ్బాక విషయంలో తనకు పార్టీ అధిష్టానం నుంచి అనుకూలత ఉందనే ధీమాలో రఘునందన్ రావు ఉన్నారు. మెదక్లో మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మరోమారు టికెట్ ఆశిస్తున్నా పీసీసీ సభ్యుడు సుప్రభాతరావు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా భూపాల్? జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ సురేశ్ షెట్కార్ అభ్యర్థిత్వంపై ఎలాంటి పోటీ ఉండకపోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే 2009 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసిన నరేంద్రనాథ్ పార్టీని వీడటంతో...డీసీసీ అధ్యక్షుడు భూపాల్రెడ్డికి పార్టీలో అంతర్గత మద్దతు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలంతా పరిశీలకుల ఎదుట వాదన వినిపించేందుకు, బల ప్రదర్శన జరిపేందుకు మద్దతుదారులను సమీకరించుకుంటుండటంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. -
ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ఖాళీ
-
సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సీమాంధ్ర ఎమ్మెల్యేల ధర్నా
సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజనపై తమ నిరసన, ఆందోళన కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్ శైలజానాథ్, ఇతర సీమాంధ్ర నేతలు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ను విభజించకుండా యధావిధిగా ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంత నాయకులతోపాటు, ప్రజలు కూడా నిరసన, ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీమాంధ్రలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ పరిస్థితులపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి వెల్లడించారు.