
ఏఐసీసీ భేటీకి వెళ్లేవారెందరు?
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం గౌరవంగా భావించే కాంగ్రెస్ నేతలు ఈ సారి.. ఆ భేటీలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
రాష్ర్టం నుంచి 150 మందికి ఆహ్వానం
ఆసక్తి చూపని అత్యధిక సభ్యులు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం గౌరవంగా భావించే కాంగ్రెస్ నేతలు ఈ సారి.. ఆ భేటీలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో వాడి, వేడిగా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ వెళ్లేందుకు నేతలు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఈ నెల 17న న్యూఢిల్లీలో జరగనున్న ఏఐసీసీ సమావేశంలో పలు కీలక ప్రకటనలు రానున్నాయని అంచనా వేస్తున్నారు.
ఆ భేటీలో పాల్గొనాలంటూ రాష్ట్రం నుంచి మొత్తం 150 మందికి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 76 మంది ఏఐసీసీ సభ్యులు కాగా, మిగిలిన వారు కో-ఆప్షన్, ఎక్స్అఫిషియో సభ్యులు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్స్అఫిషియో సభ్యులుగా పరిగణిస్తారు. మొత్తం సభ్యుల్లో సుమారు 20 మంది సభ్యులు పార్టీని వీడారు. కొందరు సభ్యులు చనిపోయారు. వీరి స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వలేదు. వీరిపోగా మిగిలిన వారిలో దాదాపు సగం మంది సభ్యులు, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత నేతలు ఏఐసీసీ సమావేశాలకు వెళ్లకపోవచ్చని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సీఎం కూడా డౌటే!: ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కూడా వెళ్లే అవకాశాలు లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నందున ఢిల్లీకి రాలేకపోతున్నానని ఆయన హైకమాండ్కు చెప్పే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం ఈనెల 16 సాయంత్రమే ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ముఖ్య నేతలంతా ఈ సమావేశాలకు వెళ్లాలనే యోచనలోనే ఉన్నారు. శాసనమండలి ఛైర్మన్ డాక్టర్ చక్రపాణి సహా ఏఐసీసీ సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా ఏఐసీసీ సమావేశాలకు వెళ్లనున్నట్లు తెలిసింది.
ఏఐసీసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉందని పలువురు సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు 17 వ తేదీన శాసనమండలికి సెలవు ప్రకటించగా, ఎవరూ కోరని కారణంగా 17 అసెంబ్లీ కొనసాగించాలనే నిర్ణయించారని పార్టీ నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈనెల 17న జరగబోయే ఏఐసీసీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి రూపొందించిన వినతిపత్రంపై తెలంగాణ, సీమాంధ్రకు చెందిన మంత్రులు సహా సుమారు వందమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేశారు.
17నుంచి అసెంబ్లీ
రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో మరో ఆరు రోజులు మాత్రమే చర్చ జరగనుంది. సం క్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 16 తేదీ వరకు అసెంబ్లీకి సెలవులు ప్రకటించగా తిరిగి 17 వ తేదీ శుక్రవారం నుంచి సమావేశాలు ప్రారం భం కానున్నాయి. 17వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరగనుండడం, కీలక నేతలంతా ఆ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆ తేదీన అసెంబ్లీ సమావేశం జరగకపోవచ్చన్న ప్రచారం ఎమ్మెల్యేల్లో సాగింది. అయితే 10వ తేదీన సభను వాయిదా వేస్తూ స్పీకర్ మనోహర్.. అసెంబ్లీ తిరిగి 17 వ తేదీన ప్రారంభమవుతుందని ప్రకటించారు. శాసనమండలి సమావేశాలు మాత్రం 18వ తేదీన పునప్రారంభమవుతాయి. ఈనెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ మలివిడత సమావేశాలు ప్రారంభమై 10వ తేదీతో ముగిశాయి.