భారత్‌లో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌.. ఆసీస్‌ జట్టు ప్రకటన | Australia Announce 16-Member Under-19 Squad for India Tour | Multi-Format Series | Sakshi
Sakshi News home page

భారత్‌లో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌.. ఆసీస్‌ జట్టు ప్రకటన, భారత సంతతి కుర్రాడికి చోటు!

Aug 3 2026 12:52 PM | Updated on Aug 3 2026 1:42 PM

India Host-Multi-Format Series-Cricket Australia Announce 16 Member-Squad

కేసీ బార్టన్, విల్ బైరోమ్ (PC: Cricket Australia Twitter)

ఆస్ట్రేలియా సీనియ‌ర్ జ‌ట్టు ప్ర‌స్తుతం పాకిస్తాన్ టూర్ వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతుంటే, తాజాగా వ‌చ్చే నెల‌లో భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న అండ‌ర్‌-19 మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా 16 మందితో కూడిన అండ‌ర్‌-19 జ‌ట్టును ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ మ‌ధ్య‌లో జ‌ర‌గ‌నున్న ఈ మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా అండ‌ర్‌-19 జ‌ట్టు మూడు యూత్‌ వ‌న్డేల‌తో పాటు రెండు యూత్‌ టెస్టులు (నాలుగు రోజులు) ఆడ‌నుంది. 

ఈ నేప‌థ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా సోమ‌వారం 16 మందితో జ‌ట్టును ప్ర‌క‌టించింది. కేసీ బార్ట‌న్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, విల్ బైరోమ్ అత‌డికి డిప్యుటీగా ఉండ‌నున్నాడు. 16 మందిలో కేసీ బార్ట‌న్‌, విల్ బైరోమ్ మాత్ర‌మే జింబాబ్వే వేదిక‌గా జ‌రిగిన‌ అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడారు. ఇక ఇదే జట్టులో భారత సంతతి కుర్రాడు, గుజరాత్‌కు చెందిన నీల్‌ పటేల్‌ చోటు దక్కించుకున్నాడు.

ఇక జ‌ట్టులో క్వీన్స్‌లాండ్ నుంచి ఐదుగురు ఆట‌గాళ్లు ఉండ‌గా, విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్ నుంచి ముగ్గురేసి, త‌స్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్ర‌న్ ఆస్ట్రేలియా నుంచి మిగిలిన ఆట‌గాళ్లు ఉన్నారు. ఇక మ్యాచ్‌ల‌న్నీ రాజ్‌కోట్‌, అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి.

భార‌త్‌లో ఆసీస్ సిరీస్ షెడ్యూల్‌
👉తొలి యూత్ వన్డే – శుక్రవారం, సెప్టెంబర్ 18
👉రెండో యూత్ వన్డే – సోమవారం, సెప్టెంబర్ 21
👉మూడో యూత్ వన్డే – బుధవారం, సెప్టెంబర్ 23

👉మొద‌టి యూత్ టెస్ట్ – ఆదివారం, సెప్టెంబర్ 27-30 వ‌ర‌కు
👉రెండో యూత్ టెస్ట్ – సోమవారం, అక్టోబర్ 5-8 వ‌ర‌కు

భార‌త్‌లో సిరీస్ నిర్వ‌హ‌ణ ఎందుకంటే?
ఇండియా అండ‌ర్‌-19 జ‌ట్టుతో మ‌ల్టీ ఫార్మాట్‌లో సిరీస్ నిర్వ‌హ‌ణ ఎందుకు అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారిణి సొన్యా థాంప్స‌న్ వివ‌ర‌ణ ఇచ్చారు. "మా పాత్‌వేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని కొంతమంది అత్యుత్తమ యువ ఆటగాళ్లకు మ‌రిన్ని అవకాశాల‌ను కల్పించి వారిని ప్రోత్స‌హించ‌డం మాకు చాలా సంతోషంగా ఉంది. 

కఠిన పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడం ఆటగాళ్లకు సాంకేతికంగా, మానసికంగా ఎదగడానికి సహాయపడుతుంది. భారత్‌లో పర్యటించడం, సవాలుతో కూడిన పరిస్థితుల్లో అత్యున్నత స్థాయి ప్రత్యర్థులతో తలపడడం ద్వారా అనుభ‌వంతో కూడిన పాఠాలు నేర్చుకుంటారు. ఇది అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లను సాంకేతికంగా, మానసికంగా పరీక్షిస్తుంది," అని థాంప్సన్ తెలిపారు. మరోవైపు ఆసీస్‌తో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌కు భారత అండర్‌-19 జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.

ఆస్ట్రేలియా అండ‌ర్‌-19 జ‌ట్టు:
కేసీ బార్టన్ (కెప్టెన్‌), హేడెన్ బార్బులోవిక్, ఎలీ బ్రెయిన్, విల్ బైరోమ్ (వైస్ కెప్టెన్‌), బ్లేక్ క్యాటిల్, జాక్ జోస్నెక్, స్పెన్సర్ గ్రీన్, కానర్ గ్రెగొరీ, చార్లీ హెండర్సన్, జెడ్ హోలిక్, మాథ్యూ లాఫ్‌, నీల్ పటేల్, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థియో సింగోస్, థామస్ వాసియో.

చదవండి: విండీస్‌కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్‌తో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement