పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం | Maharashtra BJP Chief Bawankule's Son Audi Hits Several Vehicles In Nagpur | Sakshi
Sakshi News home page

పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం

Sep 10 2024 7:49 AM | Updated on Sep 10 2024 8:53 AM

Maharashtra BJP Chief Bawankule's Son Audi Hits Several Vehicles In Nagpur

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్‌కులే మద్య మత్తులో బీభత్సం సృష్టించారు. పూటుగా మద్యం సేవించి ఇతర వాహనాల్ని ఢీకొట్టారు. ఘటన అనంతరం సంకేత్‌ బవాన్‌కులేతో పాటు అతని స్నేహితులు పరారయ్యారు. సంకేత్‌ కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారని తెలుస్తోంది.  

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..సోమవారం అర్ధరాత్రి 1 గంటకు మద్యం మత్తులో ఉన్న సంకేత్‌ బవాన్‌కులే ఆడి కారుతో మాన్కాపూర్ ప్రాంతం వైపు వెళుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్న వాహనాల్ని ఢీకొట్టాడు. నానా హంగామా చేశాడు. అయితే సంకేత్‌ తీరుతో కోపోద్రికులైన ఇతర వాహనదారులు.. అతని కారును వెంబడించారు. దీంతో మార్గం మద్యలోనే కారును వదిలేశాడు. అందులో ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.  

అరెస్ట్‌.. ఆపై బెయిల్‌
ప్రమాదంలో తన కారుకు డ్యామేజీ జరిగిందంటూ జితేంద్ర సోన్‌కాంబ్లే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంకేత్‌ బవాన్‌కులే కారు డ్రైవర్‌ అర్జున్ హవ్రే, రోనిత్ చిట్టమ్‌వార్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొద్ది సేపటికే బెయిల్‌పై విడుదలయ్యారు.  

చట్టం ముందు అందరూ సమానులే
ఈ సందర్భంగా కారు ప్రమాదంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే స్పందించారు. ఆ ఆడి కారు తన కుమారుడు సంకేత్ పేరిట రిజిస్టర్ అయినట్లు అంగీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా క్షుణ్ణంగా,నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి.దోషులకు కఠిన శిక్ష విధించాలి.చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement