Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..! | Lok Sabha Election 2024: Toung slips on own party candetes in election campaign | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!

May 17 2024 4:42 AM | Updated on May 17 2024 4:42 AM

Lok Sabha Election 2024: Toung slips on own party candetes in election campaign

అసలే ఇది ఎన్నికల సీజన్‌. ప్రచారం దుమ్మురేగుతోంది. మైకు దొరికితే చాలు.. నేతల హామీలకు, విమర్శల ధాటికి అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఆ క్రమంలో కొన్నిసార్లు తాము ఏ పారీ్టలో ఉన్నాం, ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నామన్న స్పృహ లేకుండా నేతలు నోరు జారుతున్నారు. సొంత పార్టీ అభ్యరి్థనే చిత్తుచిత్తుగా ఓడించండనీ, ప్రత్యర్థి పారీ్టకి ఓటేయాలనీ పిలుపిస్తున్నారు! జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా నాలుక్కరుచుకుంటున్నారు. ఇలా టంగ్‌ స్లిప్పవుతున్న వారిలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినవారే గాక కాకలుతీరిన నేతలు కూడా ఉండటం విశేషం. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్‌ అన్నారు గానీ, రాజకీయాల్లో మాత్రం నోరుజారితే నవ్వులపాలే...!! 

అధిర్‌.. అయ్యో రామా! 
బీజేపీకి ఓటేయడం మేలన్న కాంగ్రెస్‌ దిగ్గజం  
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశి్చమ బెంగాల్‌ కాంగ్రెస్‌ దిగ్గజం అధిర్‌ రంజన్‌ చౌదరి ఇటీవల ఎన్నికల ర్యాలీలో మళ్లీ నోరుజారారు. ‘బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటేసే కంటే బీజేపీకి వేయడం నయం’ అన్నారు! జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన పారీ్టకి ఓటేయాలని పిలుపివ్వడం పట్ల సొంత నేతలే తీవ్రంగా మండిపడ్డారు. దాంతో తానలా అన్లేదంటూ అ«ధిర్‌ మాట మార్చారు. కానీ అధికార తృణమూల్‌ దీన్ని మంచి అస్త్రంగా అందిపుచ్చుకుంది. బెంగాల్‌లో అ«ధిర్‌ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయింది.

లాలు కూతుర్ని ఓడించండి! 
సొంత పార్టీ ఎమ్మెల్సీ పిలుపు 
బిహార్‌ రాజకీయ దిగ్గజం లాలు ప్రసాద్‌ యాదవ్‌ కూతురు రోహిణి ఆచార్య సరన్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెను గెలిపించుకునేందుకు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లాలు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కూతురితో పాటు పాల్గొన్న తొలి సభలోనే హంసపాదు ఎదురైంది! సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘ఓటర్లు, పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా. రోహిణీ ఆచార్యను భారీ మెజారిటీతో ఓడించండి’ అంటూ పిలుపునిచ్చారు. దాంతో లాలుతో పాటు వేదికపై ఉన్న ఆర్జేడీ నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సునీల్‌ క్షమించాలంటూ వేడుకున్నారు.

కంగనా... కన్ఫ్యూజన్‌! 
గురి తప్పిన ‘నాన్‌ వెజ్‌’ విసుర్లు 
బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ బీజేపీలో చేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. స్టార్‌ క్యాంపెయినర్‌ అయిన ఆమె బిహార్‌ ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్‌ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను విమర్శించి నవ్వులపాలయ్యారు. ‘‘దారి తప్పిన యువరాజులున్న పారీ్టలకు మన దేశంలో కొదవ లేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలకునే రాహుల్‌ గాంధీ కావచ్చు. నవరాత్రుల సందర్భంగా కూడా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు. అంతా అదే బాపతు’ అంటూ కంగన విరుచుకుపడ్డారు. దాంతో భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తేజస్వీ యాదవ్‌ కూడా, ‘ఇంతకీ ఎవరీ అమ్మగారు?!’ అంటూ ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని సుభాష్‌ చంద్ర బోస్‌ అన్న కంగనా వ్యాఖ్యల పైనా విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది.  

శివపాల్‌.. శివ శివా! 
బీజేపీని గెలిపించాలన్న సమాజ్‌వాదీ నేత 
అది ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ఇటావా లోక్‌సభ స్థానం. జస్వంత్‌ నగర్‌లో ఎన్నికల ప్రచార సభ. జనం భారీగా హాజరయ్యారు. పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ బాబాయి, సమాజ్‌వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్‌ యాదవ్‌ మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న అఖిలేశ్, ఇటావా ఎస్పీ అభ్యర్థి జితేంద్ర దోహారే తదితరులు ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో శివపాల్‌ ఉన్నట్టుండి, ‘అందుకే నేను కోరేదొక్కటే! బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించండి!!’ అంటూ పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు. ‘ప్రజలంతా అఖిలేశ్‌ చెప్పినట్లు విని, భారతీయ జనతాపారీ్టకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించండి’ అన్నారు. దాంతో అఖిలేశ్‌ బిత్తరపోగా ఇతర ఎస్పీ నేతలంతా గతుక్కుమన్నారు. నోరు జారానని గమనించిన శివపాల్‌ కాసేపు బీజేపీపై విరుచుకుపడ్డా జనమంతా గోలగోలగా నవ్వుకున్నారు! 

అందిపుచ్చుకున్న మోదీ...
ఈ ఉదంతాన్ని తర్వాత ఇటావాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. ‘చూశారా! స్వయంగా ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు, సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ బాబాయ్‌ కూడా బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు’ అంటూ చెలరేగిపోయారు. 2019లో ములాయం కూడా బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ‘‘2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్‌ చివరి సెషన్లో ములాయం మాట్లాడుతూ, మీరు మళ్లీ విజయం సాధించబోతున్నారని నన్నుద్దేశించి నిండు సభలో అన్నారు. ఆ ఆశీర్వాదం ఫలించింది. ఇప్పుడు ములాయం మన మధ్య లేకున్నా ఆయన సోదరుడు బీజేపిని గెలిపించాలని కోరుతున్నారు. ఇది యాదృచి్ఛకమని నేననుకోవడం లేదు. 
శివపాల్‌ మనసులో ఉన్నదే బయటికొచి్చంది’’ అంటూ చెణుకులు విసిరారు!

లోగుట్టు ‘బోరా’కే ఎరుక... 
స్వపక్ష ఎంపీనే ఓడించాలన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!
అసోంలోని నగావ్‌ లోక్‌సభ స్థానంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శిబమణి బోరా కూడా ఇలాగే నోరు జారారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్‌ ఎంపీ ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్టుండి, ‘ప్రద్యుత్‌ను భారీ మెజారిటీతో ఓడించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఓడిస్తారో లేదో చెప్పండి. ఈవీఎం బటన్‌ను నొక్కి నొక్కి ప్రద్యుత్‌ కచ్చితంగా ఓడేలా చూడండి’’ అంటూ పిలుపునివ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. పొరపాటున అన్నారా, కావాలనే అన్నారా అంటూ దీనిపై తీవ్ర చర్చ కూడా జరిగింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement