బెంగాల్లో గూండారాజ్‌  | West Bengal has endured 15 years of TMC goonda raj rule | Sakshi
Sakshi News home page

బెంగాల్లో గూండారాజ్‌ 

Apr 27 2026 4:34 AM | Updated on Apr 27 2026 4:34 AM

West Bengal has endured 15 years of TMC goonda raj rule

దుండగులను కోర్టుకీడుస్తాం: మోదీ 

మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ 

కోల్‌కతా: టీఎంసీ  పాలనలో పశ్చిమ బెంగాల్లో గూండారాజ్‌ సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను వేధించే గూండాలకు తృణమూల్‌ ఆశ్రయమిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్‌నగర్, హూగ్లీ జిల్లాలోని అరామ్‌బాగ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. ‘‘క్రూరమైన తృణమూల్‌ ప్రభుత్వం మహిళలను హింసించే గూండాలకు అండగా నిలుస్తోంది. 

ఈ అరాచకాలను ఇకపై సహించబోమని చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని అన్నారు. మహిళల భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. సందేశ్‌కాళీ బాధితురాలు రేఖా పాత్ర, ఆర్జీ కర్‌ బోధనాసుపత్రి బాధితురాలైన వైద్యురాలి తల్లి రత్న దేవనాథ్‌కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లిచ్చిందని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక వలస వచ్చినవారికి సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. 

ఈ విషయంలో తృణమూల్‌ చెప్పే అబద్ధాలను నమ్మొద్దని ఆయన కోరారు. మహిళలపై అత్యాచారాలు, హింసకు పాల్పడే దుండగులను మే 4 తర్వాత రాబోయే బీజేపీ ప్రభుత్వం న్యాయస్థానం ముందు నిలబెడుతుందని మోదీ స్పష్టం చేశారు. ‘‘బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఎప్పుడో ఖాయమైంది. రెండో దశ పోలింగ్‌ ఆ విజయాన్ని సుస్థిరం చేస్తుంది. తొలి దశలో 93 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదు కావడంతో తృణమూల్‌ అహం దెబ్బతిన్నది. 

ఆ పార్టీ ఇప్పుడు ‘మా, మాటీ, మానుష్’ గురించి మాట్లాడడం మానేసింది. ఎందుకంటే వారి అరాచక పాలనలో మా (అమ్మ) కన్నీరు పెడుతోంది. మాటీ (భూమి)ని ముఠాలు, చొరబాటుదారులకు అప్పగించారు. మానుష్‌ (ప్రజలు) ఉద్యోగాలు, ఉపాధి కోసం వలస పోవాల్సిన దుస్థితి దాపురించింది’’ అని ఆక్షేపించారు. ‘‘మేం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ బెంగాల్‌లో అమలు చేస్తామన్నారు. ఈ దిశగా తొలి కేబినెట్‌ భేటీలోనే నిర్ణయం తీసుకుంటాం’’ అని ప్రకటించారు.  

ఆలయాల్లో మోదీ పూజలు 
ప్రధాని మోదీ బెంగాల్‌ ఠాకూర్‌ నగర్‌లో ఠాకూర్‌బారీ ఆలయంలో పూజలు చేశారు. కోల్‌కతాలో ప్రఖ్యాత థన్‌థానియా కాళీ ఆలయాన్నీ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని దుకాణంలో పూజా సామగ్రి కొనుగోలు చేశారు. అనంతరం ఉత్తర కోల్‌కతాలో భారీ రోడ్‌ షోలో పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement