న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల తంతు కొనసాగుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో పలు విశేషాలను పంచుకున్నారు. ఆదివారం జరిగిన తన 133వ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో స్వచ్ఛమైన ఇంధనం, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, అణుసామర్థ్యంలో భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని ఆయన వివరించారు.
పవన విద్యుత్లో పవర్ ఫుల్ రికార్డ్
ప్రపంచ పవన విద్యుత్ రంగంలో భారతదేశం సరికొత్త చరిత్ర లిఖిస్తున్నదని ప్రధాని మోదీ ప్రకటించారు. అదృశ్యమైన గాలి శక్తి దేశ పురోగతికి ఎలా చోదక శక్తిగా మారిందో వివరిస్తూ, దేశం ఇటీవల సాధించిన మైలురాయిని గుర్తుచేశారు. ప్రస్తుతం భారత పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 56 గిగావాట్లను దాటిందని, తద్వారా ఈ ఇంధన సామర్థ్యంలో మన దేశం ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరిందని ఆయన తెలిపారు.
కల్పక్కం రియాక్టర్.. అణుశక్తిలో అరుదైన ఘనత
భారత అణు కార్యక్రమానికి సంబంధించి మోదీ ఒక కీలక ఘట్టాన్ని ప్రస్తావించారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’క్రిటికాలిటీ దశకు చేరుకుందని, అంటే రియాక్టర్ ఆపరేషన్ దశ ప్రారంభమైందని వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ రియాక్టర్.. దేశ పారిశ్రామిక వృద్ధి, ఇంధన, ఆరోగ్య రంగాలకు, అలాగే ఆధునిక రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఇది మన శాస్త్రవేత్తల అద్భుత ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.
బుద్ధుని బోధనలు.. ప్రపంచ శాంతికి మార్గం
శాస్త్ర సాంకేతిక విజయాలతో పాటు రాబోయే పండుగల గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. మే నెలలో రానున్న బుద్ధ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల పరిస్థితుల్లో గౌతమ బుద్ధుని శాంతి సందేశం ఎంతో ఆవశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. శాంతి అనేది మన అంతరంగం నుంచే మొదలవుతుందని, తనను తాను జయించడమే అత్యుత్తమ విజయమన్న బుద్ధుని బోధనలను ప్రధాని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: ప్రధాని మోదీ


