ఇస్తాంబుల్: అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాపై జరుగుతున్న పోరాటంలో మరో విజయం నమోదైంది. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, భారత డ్రగ్స్ డాన్ సలీం డోలాను టర్కీలోని ఇస్తాంబుల్లో పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సింథటిక్ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించిన సలీం పట్టుబడటంతో, భారత భద్రతా సంస్థలు దీనిని ఒక కీలకమైన ముందడుగుగా ప్రకటించాయి. ఏళ్ల తరబడి భారతదేశంలోకి భారీ స్థాయిలో మత్తుపదార్థాలను సరఫరా చేసిన ఈ ప్రధాన సూత్రధారి ఆట ఎట్టకేలకు ముగిసింది.
అండర్వరల్డ్ డాన్తో చీకటి బంధం
సలీం డోలా అరెస్టుతో దావూద్ ఇబ్రహీం అండర్వరల్డ్ నెట్వర్క్ గుట్టు రట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో వ్యవస్థీకృత నేరాలకు, అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్కు మధ్య ఉన్న సంబంధం బయటపడింది. దర్యాప్తు సంస్థలు ఎప్పటినుంచో అనుమానిస్తున్నట్లే, ఈ మాఫియా ముఠాలు ప్రపంచ దేశాలకు మత్తుపదార్థాలను సరఫరా చేస్తూ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు స్పష్టమైంది.
ముంబై నుంచి దుబాయ్ వరకూ..
సలీం డోలా తన నేర సామ్రాజ్యాన్ని తొలుత ముంబై కేంద్రంగా ప్రారంభించాడు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా తన మకాంను దుబాయ్కు మార్చి, అక్కడి నుంచే మొత్తం డ్రగ్స్ నెట్వర్క్ను నడిపించాడు. అయితే, భారత దర్యాప్తు సంస్థలు గత కొన్ని నెలలుగా అతని అనుచరులపై ఉక్కుపాదం మోపాయి. 2025లో ముంబై పోలీసులు సలీం ముఖ్య అనుచరులతో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని, అతని ఆపరేషన్లకు భారీ గండి కొట్టారు.
భారత్కు రప్పించడం ఎలా?
ఈ డ్రగ్ కింగ్పిన్ను పట్టుకునేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇదివరకే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో పాటు నగదు బహుమతిని కూడా ప్రకటించింది. టర్కీ నుంచి సలీంను భారత్కు రప్పించడం చట్టపరంగా సవాలుతో కూడుకున్నప్పటికీ.. యూఏఈ వంటి అంతర్జాతీయ మార్గాల ద్వారా ఏజెన్సీలు ముమ్మరంగా దౌత్య ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అరెస్టుతో డ్రగ్స్ దందాకు సంబంధించిన ఆర్థిక మూలాలు, అంతర్జాతీయ రూట్లు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.


