Sandalwood Drug Case: CCB Found Key Evidences in Sanjana Galrani's House | సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు - Sakshi
Sakshi News home page

సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు

Sep 18 2020 8:13 AM | Updated on Sep 18 2020 2:35 PM

Key Evidence In Sanjana Home Drug Case - Sakshi

బెంగళూరు : డ్రగ్స్‌ దందాలో దక్షిణ ఆఫ్రికా పౌరులే శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో సూత్రధారులని సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్‌ పెప్పర్‌ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. పెప్పర్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం బెనాల్డ్‌ ఉడేన్నా అనే ఆఫ్రికన్‌న అరెస్ట్‌ చేశారు. అతడు అన్ని వివరాలూ వెల్లడించాడు. కన్నడ సినిమారంగానికి చెందిన సెలబ్రిటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఉడేన్నా ఆదిత్య ఆళ్వాకు చాలా సన్నిహితుడని, డ్రగ్స్‌ నిందితులు రవిశంకర్, వీరేన్‌ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవాడని తెలిసింది. బెంగళూరుతో పాటు చుట్టు ప్రక్కల రిసార్ట్‌లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. (నా పరువు తీస్తున్నారు!)

జైల్లో పుస్తక పఠనంలో నటీమణులు   
జ్యుడిషియల్‌ కస్టడీ కింద నటీమణులు రాగిణి, సంజనలను పరప్పన అగ్రహార జైలుకు తరలించి అక్కడ క్వారంటైన్‌లో ఉంచారు. జైలులో పెట్టిన టిఫిన్, భోజనాలను ఇద్దరూ ఆరగించారు. కొంతసేపు నిద్రపోతూ, మరికొంత సేపు పుస్తకాలను చదువుతూ పొద్దుపుచ్చుతున్నారు. రాగిణికి వెన్నునొప్పి సమస్య ఉండటంతో జైలు వైద్యులు ఔషధాలను అందించారు. రాగిణి, తల్లి, న్యాయవాదులను అధికారులు కలవనివ్వడం లేదు. ఫోన్లో మాట్లాడడానికి అవకాశమిచ్చారు.
 
కింగ్‌పిన్లతో నటీమణులకు లింక్‌లు   
దీని ఆధారంగా ఆదిత్య ఆళ్వకు చెందిన రిసార్ట్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. లూమా, ఉడేన్నాలు బెంగళూరులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తుండగా వీరి వెనుక కూడా ఒక పెద్ద తలకాయ ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్‌ చేస్తుండగానే ముగ్గురు కింగ్‌పిన్‌లు పరారు కావడంతో కేసుపై సీసీబీ గోప్యత పాటిస్తోంది. ఈ ముగ్గురు దొరికితే మరెంతోమంది క్లయింట్ల పేర్లు బయట పడవచ్చు. ఈ కింగ్‌పిన్‌లు నటీమణులు రాగిణి, సంజనలతో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు సీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆదిత్య ఆళ్వ విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు.  

సంజన ఇంట్లోని వస్తువులే ముఖ్య సాక్ష్యాలు? 
14వ నిందితురాలు సంజన హై–ఫై పార్టీలలో పాల్గొనడంతో పాటు ప్రకాశ్‌ రాంకా, రాహుల్‌తో కలిసి బెంగళూరు, గోవా, కేరళ, శ్రీలంకలో పబ్, బార్, అపార్ట్‌మెంట్‌ పార్టీలకు డ్రగ్స్‌ను గుట్టుగా సరఫరా చేసేవారని సీసీబీ చెబుతోంది. సెలబ్రిటీలకు కూడా మత్తు పదార్థాలను పంపేవారమని రాంకా ఒప్పుకున్నాడు. సంజన ఇంటిలో 9 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా ఆమె డ్రగ్స్‌ మాఫియాలో పాల్గొన్నట్లు సీసీబీ అనుమానిస్తోంది. సిమ్‌కార్డ్, ఐఫోన్, ప్రోమాక్స్‌ కంప్యూటర్, సీసీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకొని సమాచారం సేకరించగా ఆసక్తికర సాక్ష్యాలు బయట పడినట్లు తెలిసింది. నేడు సంజనా బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది. 

కేసు విచారణలో ఉంది, నేనేం మాట్లాడను : ఐంద్రిత 
డ్రగ్స్‌ కేసుపై నేను ఏమీ మాట్లాడకూడదు, సీసీబీ అధికారులు విధించిన నియమాలను పాటించాలి అని నటి ఐంద్రితా రై అన్నారు. విచారణ జరుగుతున్నందున తను మీడియాతో మాట్లాడితే నియమోల్లంఘన కిందకు వస్తుందన్నారు. దిగంత్‌ సినిమా షూటింగ్‌లకు వెళ్లవచ్చని, కానీ బెంగళూరు విడిచి వెళ్లరాదని చెప్పారన్నారు. ఒకటి రెండురోజుల్లో ఐంద్రిత దంపతులకు మరోసారి నోటీసులు పంపవచ్చని సమాచారం. కాగా, రాధారమణ సీరియల్‌ నటి శ్వేతాప్రసాద్‌ తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు.  డ్రగ్స్‌ కేసులో జైలుకెళ్లిన ఒక నటితో కలిసిఉన్న పోటో వైరల్‌ అయ్యింది. ఆ ఫోటో మీద అసభ్యంగా పోస్టింగ్‌లు పెట్టవద్దన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement