రైలు పట్టాల మధ్యలో పడుకుని.. చావు తప్పించుకున్నాడు | Kannur man lies low on track as train runs past him escapes unhurt | Sakshi
Sakshi News home page

రైలు పట్టాల మధ్యలో పడుకుని.. చావు తప్పించుకున్నాడు

Dec 25 2024 8:11 AM | Updated on Dec 25 2024 8:12 AM

Kannur man lies low on track as train runs past him escapes unhurt

ఓ వ్యక్తి పట్టాలపై నడుస్తుండగా ఎదురుగా రైలు దూసుకొచ్చింది. వెంటనే పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు తన మీదుగా వెళ్తున్నంత సేపు కదలలేదు. మెదలలేదు. రైలు వెళ్లిపోగానే లేచి.. దుమ్ము దులుపుకొని ఇంటి దారి పట్టాడు. చూసినవారికి మాత్రం గుండె ఆగిపోయినంత పనయ్యింది. కేరళ రాష్ట్రంలో కన్నూర్‌ జిల్లాలో జరిగిన ఘటనను చిత్రీకరించిన ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీడియో వైరల్‌ అవుతోంది. 

సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. మంగళూరుృతిరువనంతపురం ట్రైన్‌ కన్నూర్‌ృచిరక్కల్‌ రైల్వే స్టేషన్ల గుండా వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆ మార్గంలోని పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతను ఫోన్‌లో మాట్లాడుతుండటంతో రైలు దగ్గరగా వస్తున్న విషయాన్ని గమనించలేదు. తీరా చూసేసరికి.. తప్పించుకునే వీలులేకుండా పోయింది. వెంటనే సమయ స్ఫూర్తితో వ్యవహరించిన పవిత్రన్‌.. పట్టాల మధ్యలో పడుకున్నాడు. ట్రైన్‌ వెళ్లిపోగానే లేచి ఇంటికెళ్లిపోయాడు. 

 

 అయితే వీడియో వెనుకనుంచి చిత్రీకరించడంతో వ్యక్తిని గుర్తించడం కష్టమైంది. వైరలైన వీడియోను చూసిన పోలీసులు.. తాగిన మత్తులో వ్యక్తి అలా చేశాడేమోనని భావించారు. తరువాత విచారించగా ఆ వ్యక్తి స్కూల్‌ వ్యాన్‌ క్లీనర్‌గా 56 ఏళ్ల పవిత్రన్‌ అని తేలింది. తాను తాగలేదన్న పవిత్రన్‌.. ప్రాణాలను కాపాడుకోవడానికి అలా పట్టాలపై పడుకున్నానని చెప్పారు. ఇంకా ఆ భయం నుంచి తేరుకోలేదన్నారు. వీడియో చూసి తాము ఆశ్చర్యపోయామని, బక్కగా ఉండటం వల్లే పవిత్రన్‌ ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు అంటున్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement