బెంగళూరు: కన్నకూతురినే పొట్టనబెట్టుకున్న తల్లి ఉదంతం అంతటా చర్చనీయాంశమైంది. బెంగళూరు కాడుగోడిలో ఆరేళ్ల బాలిక వెన్నెల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లి, ప్రియునిపై అనుమానాలు బలపడ్డాయి. మార్చి 24 తేదీన బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తల్లి ప్రియాంక పుట్టిన రోజు వేడుకలను కోలారు వద్ద ఓ కెఫెలో జరుపుకొంది, అక్కడ వెన్నెలా కేక్ తిని కారులో నిద్రపోగా ఉదయానికి చనిపోయిందని తెలిపింది. మోహన్ అనే రియల్టర్తో ప్రియాంక జీవిస్తోంది. భర్త ప్రవీణ్ను వదిలేసిన ప్రియాంక లగ్జరీ లైఫ్ కోసం తపించేది.
సంతోషానికి అడ్డు అని..
కొన్ని నెలల కిందట మోహన్ను కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. సంతానం కావాలని అనుకున్నారు. తమ సంతోషాలకు వెన్నెలా అడ్డుగా ఉందని, పైగా బాలిక అంద విహీనంగా ఉందనే కారణంతో బాలిక గొంతు పిసికి చంపారనే అనుమానాలున్నాయి. ప్రియాంక కు హొసకోటే వద్ద ఐదు ఎకరాలు భూమి ఉండగా, అందులో వాటా ఇవ్వాల్సి వస్తుందనేది కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. మోహన్ను కాడుగోడి పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన రోజున ఆమె దుస్తులు మార్చారని సీసీ కెమెరాలలో వెల్లడైంది. కాగా ప్రియాంకను అరెస్టు చేశారా, పరారీలో ఉందా అనేది తెలియడం లేదు.


