జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి

Published Sun, Dec 10 2023 11:07 AM

Journalist Soumya Father Died Day Before His Daughter Birthday - Sakshi

న్యూఢిల్లీ: అరవై ఏళ్ల వయసులో కూతురు హత్యకు గురైంది. 2008లో కూతురు చనిపోయిన తర్వాతి రోజు నుంచి ఆ తండ్రి దినచర్య పూర్తిగా మారిపోయింది. కూతురిని చంపిన వారికి శిక్ష పడేందుకు 15 ఏళ్లు ప్రతిరోజు ఆయన శ్రమించాడు.

ఎక్కడా అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ పట్టు వదలని విక్రమార్కునిలా తిరిగాడు. చివరకు ఈ ఏడాది నవంబర్‌ చివరిలో తన కూతురును చంపిన నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష పడేలా చేశాడు. విషాదమేంటంటే కూతురు 41వ జయంతికి ముందు రోజు శనివారం ఆ 82 ఏళ్ల తండ్రి కన్నుమూశాడు.

ఢిల్లీలోని ఓ న్యూస్‌ ఛానల్‌లో విధులు ముగించుకుని సొంత కారులో ఆలస్యంగా ఇంటికి వస్తున్న టీవీ జర్నలిస్టు సౌమ్యను 2008 సెప్టెంబర్‌ 30న నలుగురు దుండగులు  తుపాకీతో కాల్చి చంపారు.ఈ కేసు విచారణ 15 ఏళ్ల పాటు నడిచింది. రెండు వారాల క్రితమే కోర్టు నలుగురు నిందితులకు శిక్ష విధించింది.

నిందితులను దోషులుగా నిరూపించడం వెనుక సౌమ్య తండ్రి విశ్వనాథన్‌ తీవ్ర కృషి ఉంది. 15 ఏళ్ల పాటు రోజు పొద్దున్నే లేచి కూతురు హత్య కేసు ఫాలోఅప్‌ చేయడమే ఆయన పని. అయితే అనుకున్నది సాధించి కూతురును చంపిన వారికి శిక్ష వేయించిన తర్వాత కొద్ది రోజులకే ఆయన కన్ను మూయడం పలువురి హృదయాలను ద్రవింపజేస్తోంది.

ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్‌ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement