లక్ష్మీభాను , దుస్వంత్ , సాయి కిరణ్
నలుగురు మృతి.. ఒకరు గల్లంతు.. మరొకరు క్షేమం
అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులే పశ్చిమ గోదావరి జిల్లాలో అర్ధరాత్రి ఘటన
సఖినేటిపల్లి/ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నరసాపురం కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులతో వెళ్తున్న కారు లాకుల వద్ద అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోవడంతో నలుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
ఒక యువకుడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు. వివరాలివీ.. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయ్యూరువారి మెరక గ్రామాలకు చెందిన చెరుకూరి రాజారామ్ (17), పోతుల లక్ష్మీభాను (18), నాగిరెడ్ది దుస్వంత్ (18) నర్సాపురంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరంగ్ కళాశాలలో చదువుతున్నారు. వీరితోపాటు నర్సాపురానికి చెందిన నాగాబత్తుల సాయిసూర్య (19), మట్టా సంతోష్ (19), పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు వెంకట సాయికిరణ్ (19) కూడా అదే కళాశాలలో వారితో కలిసి చదువుతున్నారు.
ఈ ఆరుగురు కలిసి శనివారం రాత్రి కారులో ఒక స్నేహితుడి బంధువు ఇంట జరిగిన వివాహానికి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన ఈ వివాహానికి హాజరైన వీరు తిరుగు ప్రయాణంలో ఉండగా, ఐతంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నుంచి సంతోష్ బయటపడగా, మిగిలిన ఐదుగురు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సంతోష్ వెంటనే స్థానికులకు ప్రమాద సమాచారం తెలియజేశాడు.
పోలీసులు వచ్చి ఎన్డీఆర్ఎఫ్, అగి్నమాపక సిబ్బంది సాయంతో గాలింపు చేపట్టగా.. ప్రమాదస్థలికి రెండు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీభాను, దుస్వంత్, సాయిసూర్య, సాయికిరణ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజారామ్ కోసం గాలిస్తున్నారు. కారును వెలికితీశారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చెట్టుకొమ్మలను పట్టుకుని..
ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే తనకు దొరికిన చెట్టుకొమ్మలను పట్టుకుని కారు పైకి ఎక్కానని చెప్పాడు. తనకు ఈత రావడంతో వెంటనే అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకున్నానని తెలిపాడు. తన స్నేహితులను కాపాడుకోలేకపోయానని కన్నీరుమున్నీరయ్యాడు.


