జెనీవా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల్లో భాగంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నుండి పరిశీలకులను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని పేర్కొన్నారు.
స్విట్జర్లాండ్లో బర్గెన్స్టాక్ రిసార్ట్ వేదికగా నిన్న అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ భేటీపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ " చర్చల్లో చాలా మంచి పురోగతి లభించింది. అంతకుముందు రోజు జరిగిన చర్చలు కూడా చాలా సానుకూలంగా సాగాయి. అణు తనిఖీల కోసం ఇన్స్పెక్టర్లను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించింది. అణు పరిశీలకులతో చర్చలు శుక్రవారం నుంచే ప్రారంభం అయ్యే అవకాశంఉంది. ఇరుపక్షాల సాంకేతిక బృందాలు తమ పనిని కొనసాగిస్తాయి " అని వాన్స్ అన్నారు.
ప్రస్తుతం హర్ముజ్ జలసంధి తెరిచే ఉందని ఈ కీలకమైన రవాణా మార్గం నిరంతరం అందుబాటులో ఉండేలా చూసేందుకు చర్చల ప్రతినిధులు ఒకప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్పై కాల్పులు ఆపాలని అమెరికా కోరుకుంటోందన్నారు. అదే విధంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించే లక్ష్యంతో లెబనాన్ కోసం ఒక ఘర్షణ నివారణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని వాన్స్ అన్నారు.
ఇరాన్తో చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా,ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపిందని వాన్స్ అన్నారు. అలాగే, వాషింగ్టన్ ఈ ప్రాంతంలోని దేశాలపై ఎలాంటి ఒప్పందాన్ని రుద్దడం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఒకవేళ దౌత్యం విఫలమైతే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇంకా చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయని వాన్స్ పరోక్షంగా ఇరాన్ను హెచ్చరించారు.


