ఢిల్లీ: జపాన్ ప్రధాని సనాయే తకాయిచి వచ్చే నెల(జులై) 1 నుంచి 3 వరకు భారత్ పర్యటనకు రానున్నారు. 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆమె పాల్గొననున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి, మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరగనున్నాయి.
అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అభిప్రాయాలను కూడా రెండు దేశాల నాయకులు పంచుకోనున్నారు. జపాన్ ప్రధాని హోదాలో సనాయే తకాయిచి భారత్కు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో జరిగిన 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.
ఆ పర్యటన అనంతరం ఇప్పుడు తకాయిచి భారత పర్యటన చేపట్టడం, భారత్-జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం వంటి అంశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం.


