జైపూర్‌ మహిళ కేసు.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు | Jaipur Woman Incident Shocking Facts | Sakshi
Sakshi News home page

జైపూర్‌ మహిళ కేసు.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

May 24 2026 9:27 AM | Updated on May 24 2026 9:27 AM

Jaipur Woman Incident Shocking Facts

జైపూర్: జైపూర్‌లో మహిళ ఆత్మహత్య  కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అను మీనాకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గౌతమ్ మీనాతో 2015లో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే గౌతమ్ మద్యానికి బానిసై ఆమెను వేధించడం ప్రారంభించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆమెను పలుమార్లు తిట్టడమే కాకుండా శారీరకంగా కూడా దాడి చేసేవాడని సమాచారం.

పదేళ్ల కుమారుడు తన తండ్రి క్రూరత్వాన్ని గురించి వివరించాడు. తన తండ్రి తరచూ అమ్మను కొట్టేవాడని తెలిపాడు. తన రక్తపోటు (బిపి) పడిపోయినప్పుడల్లా ఉప్పు నీరు ఇవ్వమని అమ్మ తనకు చెప్పేదని.. ఒకసారి తాను అమ్మకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుండగా.. తండ్రి అడ్డుకున్నారన్నారు. నాన్న తరచూ అమ్మను కొడుతూ, వేధించేవాడు.

ఒక రోజు నాన్న ఇంటికి వచ్చి, టీవీలో పాట పెట్టి, ఆ తర్వాత టీవీని పగలగొట్టి అమ్మను కొట్టాడు. నేను అమ్మ కోసం నీళ్లు తేవడానికి వెళ్తే.. నాన్న అమ్మదే తప్పు అంటూ నిందించాడు" అంటూ కుమారుడు మాహిర్ చెప్పాడు. వారి 8 ఏళ్ల కుమార్తె సమైరా కూడా తన తల్లిదండ్రుల మధ్య జరిగే తరచుగా గొడవల గురించి వివరించింది. సామాజిక కార్యక్రమాలు, ఒక ఫ్యామిలీ ట్రిప్‌కు వెళ్లినప్పుడు కూడా అందరి ముందే గొడవలు పడేవారని ఆమె పేర్కొంది.

వీడియో కాల్‌లో ఆత్మహత్య
నిరంతర వేధింపులను భరించలేక ఏప్రిల్ 7న అను మీనా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె తన భర్తకు వీడియో కాల్ చేసి ఆ కాల్ నడుస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నారు. పొరుగువారు గమనించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెను బ్రతికించడానికి సిపిఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

అను తల్లి మాట్లాడుతూ... అను తన భర్త ప్రవర్తన గురించి తరచూ ఫిర్యాదు చేసేదని.. కానీ పరిస్థితి ఇంతవరకు వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన జరిగిన రోజు తాను అను చేసిన ఫోన్ కాల్‌ను మిస్ అయ్యానని.. ఆ కాల్ ఎత్తి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోన్‌లో లభించిన ఆధారాలు
సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత.. కుమారుడు మాహిర్ తన తల్లి ఫోన్‌ను తెరిచి అందులోని కొన్ని వీడియోలను గొడవకు సంబంధించిన ఫుటేజీని సేకరించాడు. ఒక వీడియోలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో గౌతమ్.. అనును తీవ్ర పదజాలంతో తిట్టడం స్పష్టంగా వినబడుతోంది. ఆ వీడియోలో గౌతమ్.. అనును, ఆమె కుటుంబ సభ్యులను కూడా దూషించడం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement