ఎన్నికల డ్యూటీ వద్దంటూ వినతుల వెల్లువ | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: ఎన్నికల డ్యూటీ వినతుల వెల్లువ

Published Wed, Mar 20 2024 12:27 PM

Indore Government Employees Weird Leave Applications - Sakshi

దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని  ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు ఉద్యోగులు తాము తమ ఎన్నికల డ్యూటీకి హాజరకాలేమంటూ ఉన్నతాధికారులకు వినతులు సమర్పించుకుంటున్నారు. 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల డ్యూటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే  పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టారు. ఒకరు అనారోగ్యం కారణంగా  ఎన్నికల విధులు నిర్వహించలేమని పేర్కొనగా, మరొకరు తమ ఇంటిలో పెళ్లి వేడుకలు ఉన్నాయంటూ సెలవుల కోసం అభ్యర్థించారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సింగ్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసినప్పటి నుండి  సెలవులకు సంబంధించిన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులలో ముగ్గురు తాము విదేశాలకు వెళ్తున్నామని రాశారు. ఒకరు తమ కుమార్తె జపాన్‌లో డిగ్రీ అందుకోబోతున్నదని రాయగా, మరొకరు అమెరికాలో తమ కుమార్తె డెలివరికీ వెళ్లాలని రాశారు. ఇంకొకరైతే వివాహ శుభలేఖను కూడా జతచేశారు. 

ఎన్నికల విధులను తప్పించుకునేందుకు పలువురు ఉద్యోగులు తమ ఆనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారు. నిజానికి ఎన్నికల డ్యూటీలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఎంతో  శ్రద్ధగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఈ కారణంగానే పలువురు ఉద్యోగులు ఎన్నికల విధులను తప్పించుకోవాలని చూస్తారనే మాట వినిపిస్తుంటుంది.

Advertisement
Advertisement