సోషల్‌ మీడియాకు దూరం.. సివిల్స్‌కు దగ్గర.. ఐఏఎస్‌ అధికారి నేహా సక్సెస్‌ స్టొరీ | India's Youngest Female IAS Officer Neha Byadwal Success Story In Telugu, Know Interesting Facts About Her | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాకు దూరం.. సివిల్స్‌కు దగ్గర.. ఐఏఎస్‌ అధికారి నేహా సక్సెస్‌ స్టొరీ

Nov 26 2024 10:56 AM | Updated on Nov 26 2024 11:28 AM

Indias Youngest Female IAS Officer Neha Byadwal Success Story

ఈ ఆధునికయుగంలో మొబైల్ ఫోన్‌, సోషల్ మీడియా.. ఈ రెండూలేని మన రోజువారీ జీవితాన్ని ఊహించలేం. అయితే సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాలు మన దృష్టిని లక్ష్యాల నుంచి పక్కకు మళ్లీస్తున్నాయి. దీంతో చాలామంది తమ కెరియర్‌, జీవిత లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. దీనిని గుర్తించిన నేహా బయద్వాల్‌ తన కెరియర్‌ ఉన్నతి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)లో తన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు నేహా బయద్వాల్‌ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించేందుకు మూడేళ్ల పాటు మొబైల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ, ప్రిపరేషన్‌ కొనసాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన నేహా.. జైపూర్‌లో తన పాఠశాల విద్యను, భోపాల్‌లో హైస్కూల్‌ విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా నేహా తరచుగా పాఠశాలలు మారవలసి వచ్చేది. నేహా తండ్రి, శ్రవణ్ కుమార్ సీనియర్ ఆదాయపు పన్నుశాఖ అధికారి.  ఆయనే నేహా ఐఏఎస్‌ అధికారి కావడానికి ప్రేరణగా నిలిచారు. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమె యూపీఎస్‌సీ సీఎస్‌ఈ కోసం ప్రిపరేషన్‌ ప్రారంభించారు. తన మొదటి మూడు ప్రయత్నాలలో నేహా పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారు.

ఈ నేపధ్యంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగం  తన దృష్టిని మరలుస్తున్నాయని గ్రహించిన ఆమె వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు యూపీఎస్‌సీ ప్రిపరేషన్‌ కోసం వాటికి దూరంగా ఉన్నానని నేహా మీడియాకు తెలిపారు. తన ప్రిపరేషన్‌ సమయంలో నేహా స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా ఉన్నారు.  ఇలా అనేక ఒడిదుడుకులతో పోరాడి, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన నేహా.. 2021లో తన నాల్గవ ప్రయత్నంలో యూపీఎస్‌సీ సీఎస్‌ఈని ఛేదించి, 569 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్‌) సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. నేహా ఐఎస్‌ అధికారిగా ఎంపికైనప్పుడు ఆమె వయసు 24 మాత్రమే. యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలో నేహా ఇంటర్వ్యూలో 151 మార్కులతో కలిపి మొత్తం 960 మార్కులు సాధించారు. ఈ విజయం తరువాత నేహా బయద్వాల్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 28 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement