ఢిల్లీలో బెల్జియం ప్రధాని బార్ట్ డి వేవెర్తో మోదీ సమావేశం
కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయం
న్యూఢిల్లీ: వాణిజ్యం, రక్షణ, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, టెక్నాలజీ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, బెల్జియం నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వేవెర్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా రక్షణ సంబంధాలను పెంపొందించుకోవడం, పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం సహా ఇతర అంశాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని రెట్టింపు చేయాలన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అనంతరం మోదీ, వేవెర్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
గత త్రైమాసికంలో భారత్ సాధించిన 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశం ఎదుగుదలను ప్రపంచ విశ్వాసానికి, కొత్త అవకాశాలకు మూలకారణంగా అభివరి్ణంచారు. నేడు ప్రపంచం సంక్షోభ కాలాన్ని ఎదుర్కొంటోందని గుర్తుచేశారు. అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయని, అనిశ్చితి వల్ల ఆహారం, ఇంధనం, సప్లై చైన్లు సహా ప్రతి రంగం ప్రభావితమవుతోందని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ పరుగు ఎక్కడా ఆగడం లేదన్నారు. గత త్రైమాసికంలో ఏకంగా 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం ప్రశంసనీయమని ఉద్ఘాటించారు. భారత్, బెల్జియం మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మొత్తం సంబంధాలకు మూలస్తంభంగా మోదీ అభివరి్ణంచారు. రెండు దేశాల మధ్య సైనిక మారి్పడులు, శిక్షణా సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించామని చెప్పారు.
ఇరుదేశాల ప్రభుత్వాలు, రక్షణ పరిశ్రమల మధ్య కుదిరిన ఒప్పందాలు రక్షణ సహ–అభివృద్ధి, సహ–ఉత్పత్తికి కొత్త అవకాశాలను తెరుస్తాయని స్పష్టంచేశారు. నేరాల నిర్మూలనలో రెండు దేశాల ఏజెన్సీల మధ్య నిఘా సమాచార మారి్పడి, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. భారత్, బెల్జియం ప్రజల మధ్య సంబంధాలే ఇరుదేశాల బంధానికి అతిపెద్ద బలం అని ప్రధానమంత్రి వెల్లడించారు.
స్టార్టప్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, మారిటైమ్ రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపారు. విశ్వవిద్యాలయ, పరిశోధన సహకారాన్ని కూడా బలోపేతం చేస్తామన్నారు. ప్రతిభావంతుల బదిలీని సులభతరం చేయడానికి, త్వరలో ‘వలస, బదిలీ భాగస్వామ్య ఒప్పందం’కుదుర్చుకుంటామని తెలియజేశారు. చట్టబద్ధ పాలన, సంప్రదింపులు, దౌత్యంపై భారత్, బెల్జియం దేశాలకు ఎనలేని విశ్వాసం ఉందన్నారు. పునరుత్పాదక ఇంధనంపై నేడు కుదిరిన అవగాహన ఒప్పందం మన సుస్థిరత సహకారానికి కొత్త ఊపునిస్తుందని మోదీ వివరించారు.
గతంలో కంటే విస్తృతమైన సంబంధాలు: వేవెర్
భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల బెల్జియం ప్రధానమంత్రి వేవెర్ హర్షం వ్యక్తంచేశారు. ఇదొక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే భారత్, బెల్జియం దేశాలు గతంలో కంటే విస్తృతమైన, మరింత వ్యూహాత్మకమైన సంబంధాలను నిర్మించుకుంటున్నాయని వివరించారు.


