టీవీ డిబెట్‌లో ఐఐటీ బాబాపై దాడి.. వీడియో వైరల్‌ | IIT Baba Alleges Beaten Up During TV News Debate Video Viral | Sakshi
Sakshi News home page

టీవీ డిబెట్‌లో ఐఐటీ బాబాపై దాడి.. వీడియో వైరల్‌

Mar 1 2025 8:21 AM | Updated on Mar 1 2025 9:45 AM

 IIT Baba Alleges Beaten Up During TV News Debate Video Viral

ఢిల్లీ: కుంభామేళాతో పాపులర్‌ అయిన ఐఐటీ బాబా అభయ్‌ సింగ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కొందరు వ్యక్తులు ఆయనపై కర్రలతో దాడి చేశారు. అభయ్‌ సింగ్‌లో ఓ టీవీ ఛానల్‌లో డిబెట్‌లో పాల్గొన్న సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐఐటీ బాబా అభయ్‌ సింగ్‌ తాజాగా నోయిడాలో ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌లో డిబెట్‌లో పాల్గొన్నారు. డిబెట్‌ కొనసాగుతున్న సమయంలో కాషాయ దుస్తులు ధరించి వచ్చిన కొంత మంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. అనంతరం, అభయ్‌సింగ్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి తర్వాత ఆయన డిబెట్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని పోలీస్‌ అవుట్ పోస్టు ఎదుట బైఠాయించారు. దీంతో, పోలీసులు.. ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎవరీ ఐఐటీ బాబా..?
ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభ‌య్ సింగ్ ఇప్పుడు బాబాగా అవ‌త‌రించారు. ఐఐటీ బాబాగా (IIT Baba) పిలుస్తున్నారు. అభ‌య్ సింగ్‌ది హ‌ర్యానా రాష్ట్రం. మహా కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా పేరుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం.. కొంతకాలం కార్పొరేట్‌లో పనిచేసిన ఆయన.. దాన్ని వదులుకొన్నారు. ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. మహా కుంభమేళాకు వచ్చిన ఆయన.. ఓ వార్తా ఛానెల్‌ ఇంటర్వ్యూతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఐఐటీ బాబా, ఇంజినీర్‌ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్‌ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. 

నెటిజన్లకు క్షమాపణలు..
ఇదిలా ఉండగా.. చాంపియన్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌‌పై భారత్‌ గెలవదంటూ ఐఐటీ బాబా (IIT Baba) జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. ‘ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే’ అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్‌ అభిమానులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement