పట్టాలు తప్పిన హౌరా–ముంబై రైలు | Howrah-Mumbai train derailed | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన హౌరా–ముంబై రైలు

Jul 31 2024 4:33 AM | Updated on Jul 31 2024 4:33 AM

Howrah-Mumbai train derailed

జంషెడ్‌పూర్‌/రాంచీ/చాయ్‌బసా/కోల్‌కతా: జార్ఖండ్‌లోని సెరాయ్‌కెరా–ఖర్సావాన్‌ జిల్లాలో హౌరా–ముంబై మెయిల్‌ రైలు పట్టాలు తప్పింది. 18 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. జంషెడ్‌పూర్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని బారాబంబూ స్టేషన్‌ దగ్గర్లోని పోటోబెబా గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 

ఘటనాస్థలికి సమీపంలోనే గూడ్సు రైలు ఒకటి పట్టాలు తప్పిందని, రెండు ఘటనలు ఒకేసారి జరిగాయా అనేది తేల్చాల్సి ఉందని సౌత్‌ఈస్ట్‌రైల్వే అధికార ప్రతినిధి ఓం ప్రకాశ్‌ చరణ్‌ చెప్పారు. అయితే ఆగిఉన్న గూడ్సు రైలును హౌరా–ముంబై రైలు ఢీకొట్టిందని వెస్ట్‌ సింఘ్‌భమ్‌ డెప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ చౌదరి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. 

మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.1 లక్ష ఇవ్వనున్నారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటన జరిగిన రైల్వే మార్గం గుండా వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లను రద్దుచేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.

Advertisement
 
Advertisement
Advertisement