ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు  | Home secretary led committee to overhaul aviation safety | Sakshi
Sakshi News home page

ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు 

Jun 15 2025 6:34 AM | Updated on Jun 15 2025 10:12 AM

Home secretary led committee to overhaul aviation safety

పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడి 

ఎయిర్‌ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష  

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి బృందం దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. శనివారం ఎయిర్‌ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఢిల్లీలోని ఉడాన్‌ భవన్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. మీడియా సమావేశానికి ముందు అక్కడి వారంతా మృతులకు సంతాపసూచికగా ఒక నిమిషం మౌనం పాటించారు.

 ‘‘ఉన్నత స్థాయి బృందంలో హోంశాఖ కార్యదర్శి, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, అహ్మదాబాద్‌ పోలీసు కమిషనర్, ఐబీ స్పెషల్‌ డైరెక్టర్‌ నియమించాం. అవసరమైతే మరి కొందరిని కమిటీలోకి తీసుకుంటాం. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక అందిస్తుందని భావిస్తున్నాం’’అని మంత్రి తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే గుజరాత్‌ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాయన్నారు.

 ‘‘బోయింగ్‌787–8 డ్రీమ్‌లైనర్‌ విమానంలోని బ్లాక్‌బాక్స్‌ శుక్రవారం సాయంత్రం దొరికింది. దానిని డీకోడ్‌ చేసి అందులోని సమాచారాన్ని సమగ్రస్థాయిలో విశ్లేషించిన తర్వాతే మీడియాకు అదనపు సమాచారం అందజేస్తాం. బోయింగ్‌ 787 సిరీస్‌ విమానాల భద్రతపై దర్యాప్తునకు ఆదేశించాం. ప్రస్తుతం బోయింగ్‌787 సిరీస్‌లో 33 విమానాలు ఉన్నాయి. వీటిలో ఏడు విమానాల భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించా. ఈ సిరీస్‌ విమానాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించాం. ఉన్నత స్థాయి బృందం సోమవారం భేటీ అవుతుంది’’అని మంత్రి పేర్కొన్నారు. 



ఆ బాధ నాకూ తెలుసు..  
ఈ విమాన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రామ్మోహన్‌ అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ‘రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు’అని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయని, మృతదేహాలను వీలైనంత తొందరగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement