
కొచ్చి:కేరళలోని కొచ్చిలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్కు చెందిన 42 ఏళ్ల జీఎస్టీ అధికారితో పాటు అతడి 80 ఏళ్ల తల్లి,35ఏళ్ల సోదరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరు చనిపోయి నాలుగు రోజులవుతోందని,మృతదేహాలు కుళ్లిపోవడం స్టార్టైందని కొచ్చి త్రిక్కాకర పోలీసులు తెలిపారు.
జీఎస్టీ అధికారి ఇంటిలో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తలుపు తెరవగా మరణాల విషయం బయటపడింది.అధికారి తల్లి మృతదేహం ఒక షీట్తో కప్పిఉండడం అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారి సోదరి జార్ఖండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(జేఏఎస్) అధికారిగా పనిచేస్తున్నారు.
ఆమె పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ర్యాంక్ సాధించారు. అయితే పరీక్షల అవకతవకలకు సంబంధించి ఆమెపై ప్రస్తుతం సీబీఐ కేసు విచారణలో ఉంది. ఆమె మరణం ఆశ్చర్యానికి గురిచేసిందని తోటి జేఏఎస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వీరివి ఆత్మహత్యలనే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం వివరాలొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు.