న్యూఢిల్లీ: కేంద్ర మైనార్టీ వ్యవహారాలు, పాడి పశుసంవర్థక, మత్స్య శాఖల సహాయ మంత్రి, సీనియర్ బీజేపీ నేత జార్జ్ కురియన్ (65) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. 2024 ఆగస్టులో మధ్య ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కురియన్ పదవీకాలం జూన్ 21న ముగియడం, ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఆయన్ను బరిలోకి దింపకపోవడం రాజీనామాకు దారితీసింది. జార్జ్ కురియన్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 (2) ప్రకారం కురియన్ రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయిన కారణంగానే తనకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కిందని, కలలో కూడా ఊహించని అవకాశం దక్కిందని జార్జ్ కురియన్ మంగళవారం తన ఫేసబుక్ అకౌంట్లో వెల్లడించారు. ప్రధానితో కలిసి ఉన్న ఒక ఫొటోను షేర్ చేసిన ఆయన తనకు ఈ అవకాశం కల్పించినందుకు వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.


