బిష్ణుపూర్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్(Manipur)లో ఉగ్రవాదులు కలకలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో రెండు నిషేధిత సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. బిష్ణుపూర్లోని మోయిరాంగ్ ఓక్షోంగ్బంగ్లో నిషేధిత కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (పీడబ్ల్యూజీ)సభ్యుడిని శనివారం అరెస్టు చేయగా, తాజాగా ఇదే జిల్లాలోని నంబోల్ బజార్లో కేసీపీ క్రియాశీల సభ్యుడైన ఒక టీనేజర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బిష్ణుపూర్లోని నింగ్థౌఖోంగ్లో నిషేధిత కేసీపీ(పీడబ్ల్యుజీ)కి చెందిన చురుకైన క్యాడర్ను అరెస్టు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో జరిగిన తనిఖీల్లో భద్రతా దళాలు.. యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(United People's Party of Kanglipak) (యుపీపీకే) సభ్యుడిని అరెస్టు చేశాయని ఆయన పేర్కొన్నారు. అలాగే శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన తనిఖీల్లో పోలీసులు ఉగ్రవాదులకు చెందిన తుపాకీలను స్వాధీనం చేసుకున్నారన్నారు.
శుక్రవారం నాడు బిష్ణుపూర్, తౌబాల్,ఇంఫాల్ తూర్పు జిల్లాలలో రెండు నిషేధిత సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు(Security forces) అరెస్టు చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిషేధిత సంస్థ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్-పాంబే)కి చెందిన ఇద్దరు సభ్యులను బిష్ణుపూర్ జిల్లాలోని నంబోల్లో అరెస్టు చేశారు. వీరు 47 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేశారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని పట్సోయ్ పార్ట్-4 నివాసి లైతోంజమ్ దిలీప్ సింగ్ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి నుండి కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఒక ఎం20 పిస్టల్, ఒక మ్యాగజైన్, రెండు కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు