
ఇక వారికి నరకమే గతి: ఫరూక్ అబ్దుల్లా
ఉగ్ర దాడిపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం వ్యాఖ్యలు
పహల్గాంలో పర్యటన.. టూరిస్టులతో సంభాషణ
శ్రీనగర్: ఉగ్రవాదుల పాపాలు పండాయని, దేశంలో ఉగ్రవాదాన్ని తక్షణమే పెకిలించివేయాలని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. ఉగ్రవాదం ఆనవాళ్లు సైతం ఉండడానికి వీల్లేదని అన్నారు. ఉగ్ర విష భుజంగాలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై మన ప్రభుత్వం చేపట్టే ప్రతీకార చర్యలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఆయన శనివారం పహల్గాంలో పర్యటించారు. గత నెల 22న పర్యాటకులపై దాడి జరిగిన తర్వాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.
ఈ దాడికి పాల్పడిన ముష్కరులను, వారిని వెనుక ఉండి నడిపించిన కుట్రదారులకు నరకమే గతి అని స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను రక్షించే క్రమంలో ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు కోల్పోయిన అదిల్ షా కుటుంబాన్ని ఫరూఖ్ అబ్దుల్లా పరామర్శించారు. ముష్కరులు సాగించిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. వారిపై నిప్పులు చెరిగారు. ‘‘ఇక్కడ 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు రోజుల క్రితమే వివాహం జరిగిన ఓ నవ వధువు తన భర్తను పోగొట్టుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి ఓ బిడ్డ బిగ్గరగా రోదించాడు.
మారణకాండ చూసిన తర్వాత మాకు భోజనం సహించలేదు. మానవత్వాన్ని పొట్టనపెట్టుకున్న ఆ భూతాలు ఇప్పటికీ ప్రాణాలతో సంచరిస్తున్నాయి. వారు తమను తాము ముస్లింలం అని చెప్పుకుంటున్నారు. కానీ, వారు ముమ్మాటికీ ముస్లింలు కాదు. బాధితుల త్యాగాలు వృథా కావడానికి వీల్లేదు. ఉగ్రవాదుల పాపాల పుట్ట నిండిపోయింది. వారిపై తగిన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. జమ్మూకశ్మీర్లో 35 ఏళ్లుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
కానీ, వారు ఎప్పటికీ విజయం సాధించలేరు’’ అని ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. మానవత్వాన్ని హత్య చేసిన వారు నరకానికి తప్ప స్వర్గానికి వెళ్లలేరని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఆగిపోతేనే జమ్మూకశ్మీర్ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పహల్గాం తరహా దాడులను తీవ్రంగా వ్యతిరేకించాలని స్థానికులకు పిలుపునిచ్చారు.
భయపడితే మరణించినట్లే...
పహల్గాంలో పలువురు పర్యాటకులతో ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. ఉగ్రదాడుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్భయంగా ఉండాలని సూచించారు. జమ్మూకశ్మీర్ను మధ్యలోనే వదిలివెళ్లొద్దని కోరారు. పర్యటన పూర్తి చేసుకోవాలని చెప్పారు. ఇక్కడికి మరెంతో మంది పర్యాటకులు రావాలని ఆకాంక్షించారు. ఎవరూ భయపడొద్దని అన్నారు. భయం అనేది చావుతో సమానమని వ్యాఖ్యానించారు. భయపడితే మరణించినట్లేనని పేర్కొన్నారు.