
రాష్ట్రపతికి వృద్ధ దంపతుల లేఖ
యశవంతపుర(కర్ణాటక): తమ జీవనానికి ఆసరాగా ఉండే భూమిని బ్యాంక్లో తాకట్టు పెడితే, అప్పు తీర్చలేదని వేలం వేసేశారు, మేమిక జీవించలేం, కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని వృద్ధ దంపతులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. డిఆర్ విజయ్, హెచ్ఎన్ పార్వతికి 7 ఎకరాలు ఉండగా, మూడిగెరె కర్ణాటక గ్రామీణ బ్యాంక్లో కుదువపెట్టి రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
కరోనా విపత్తు, అడవి జంతువుల బెడద వల్ల పంటలు పండలేదు. దీంతో అప్పులు తీర్చలేకపోయారు. గతేడాది రూ.5.30 లక్షలను చెల్లించారు. మిగతా డబ్బులను కట్టలేకపోయారు. బ్యాంక్ అధికారులు హడావుడిగా ఆ పొలాన్ని వేలం వేసి అమ్మేశారు. తమకు చెప్పకుండానే ఇదంతా చేశారని, ఇక మరణమే శరణ్యమని వృద్ధ దంపతులు విలపించారు. వృద్ధులం అయినందున ఏ పనీ చేయలేం. మా భూమిని అప్పగించాలని, లేదంటే మరణాన్ని ప్రసాదించాలని లేఖలో మనవి చేశారు.