న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం గాలి నాణ్యత పూర్తిగా క్షీణించి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)లో 425కి చూపించడంతో కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించి నిషేదాజ్ఞాలు విధించింది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.
పూర్తిగా క్షీణించిన గాలినాణ్యత
ఢిల్లీ అంటేనే గాలి కాలుష్యానికి మారుపేరులా మారింది. చలి కాలంలో ఆ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు అధిక స్థాయిలో వాహనాలు వాడడం, పంట వ్యర్థాలను కాల్చివేయడం, తదితర కారణాలతో ఆ ప్రాంతంలో తరచుగా గాలి నాణ్యత క్షీణిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 362 గా ఉన్న గాలి నాణ్యత మంగళవారం ఉదయం మరింతగా క్షీణించి 425కు చేరి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో వెంటనే స్పందించిన కేంద్రం పలు నిషేదాజ్ఞాలు జారీ చేసింది.
అత్యవసరమయితే తప్ప నిర్మాణాలు చేపట్టడం లేదా కూల్చివేయడం నిషేదమని తెలిపింది.
రాజధాని పరిసర ప్రాంతాలలోని అన్ని మైనింగ్ కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డిజీల్ వాహనాలు రోడ్లపై తిరగడం నిషేదం.( దివ్యాంగులకు మినహాయింపు)
5వ తరగతి వరకూ పాఠశాలలు హైబ్రీడ్ మోడల్ లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. వీలైతే విద్యార్థులు క్లాసులు ఆన్లైన్ మోడల్లో వినాలని సూచించింది.
ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ కొలతలు
స్టేజ్-1 తక్కువ (200-300)
స్టేజ్-2 మరింత తక్కువ (301-400)
స్టేజ్-3 ప్రమాదకరస్థాయి (401-450)
స్టేజ్-4 తీవ్రప్రమాదకరం( 450 ప్లస్)


