పట్నా: బిహార్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ పట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆర్జేడీ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు ఆకాష్ యాదవ్తో పాటు మరో ఏడుగురు కలిసి తనను, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన సచివాలయం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో పాటు, తనకు తక్షణమే భద్రత పెంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
నివాసంలోకి చొరబాటు.. ప్రతిపక్షాల కుట్ర?
తనను అంతమొందించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. పట్నాలోని తన నివాసంలోకి నలుగురు వ్యక్తులు బలవంతంగా చొరబడ్డారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపే వారు పరారయ్యారని మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపిన ఆకాష్ యాదవ్, ఈ తరహా హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను, తనను ఒకేసారి మట్టుబెట్టాలనేది వారి ప్లాన్ అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.
రివర్స్ కేసు.. చిన్నారి అపహరణ బెదిరింపులు
ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తేజ్ ప్రతాప్పై కూడా పట్నాలో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆకాష్ యాదవ్ కుటుంబానికి చెందిన ఒక నివాసంలోకి తేజ్ ప్రతాప్ బలవంతంగా దూసుకెళ్లారని, అక్కడ ఉన్న ఒక చిన్నారిని తన ‘కూతురు’గా పిలుస్తూ, ఆమెను కలవనివ్వకపోతే అపహరిస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో అమెరికా నంబర్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వాయిస్ నోట్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
రాజకీయ కక్ష సాధింపే..
తనపై వచ్చిన ఆరోపణలను తేజ్ ప్రతాప్ యాదవ్ పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో సదరు వ్యక్తి ప్రవర్తనపై తాను చట్టపరమైన నోటీసులు పంపినందుకే, కక్ష గట్టి తనపై తప్పుడు కథనాలతో కూడిన ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వివాదాల కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడైన తేజ్ ప్రతాప్ను పార్టీ నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఒడిశా లెక్కలే ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడుతున్నాయా?


