Covid-19: కరోనా కేసుల ఉధృతి | Covid-19: India logs 614 coronavirus infections in last 24 Hours | Sakshi
Sakshi News home page

Covid-19: కరోనా కేసుల ఉధృతి

Dec 21 2023 4:37 AM | Updated on Dec 21 2023 4:37 AM

Covid-19: India logs 614 coronavirus infections in last 24 Hours - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 21వ తేదీ తర్వాత ఒక్క రోజులో ఇంతగా కొత్త కేసులు నమోదవడం ఇదే తొలిసారికావడం గమనార్హం. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు కోవిడ్‌తో కన్నుమూశారు.

భారత్‌లో కొత్తగా వెలుగుచూసిన జేఎన్‌1 ఉపరకం వైరస్‌ కేసులు ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో 21 నమోదయ్యాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ చెప్పారు. ఈ వైరస్‌ సోకినవారు 92 శాతం వరకు ఇంటివద్దే చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,311కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటకల్లో రోజువారీ కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల కనిపించింది.

ఆరోగ్య మంత్రి ఉన్నతస్థాయి సమావేశం
కేసుల ఉదృతి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘ పెరుగుతున్న కేసులతో ఆందోళన అక్కర్లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం, కరోనా కేసుల నిర్ధారణ పరీక్షల పెంపు, ఆస్పత్రుల్లో చికిత్స సన్నద్ధత అంశాలపై సూచనలు చేశారు.

కొత్తరకం వేరియంట్‌గా భావించే అనుమానిత కేసుల శాంపిళ్లను వెంటనే ఇన్సాకాగ్‌ జన్యక్రమ విశ్లేషణ ల్యాబ్‌లకు పంపండి. కేసుల నిర్ధారణ, నిఘా, చికిత్స విధానాలను పటిష్టంచేయండి. ఆస్పత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్, పడకలు, వెంటిలేటర్లు, వైద్య ఉపకరణాలు, ఆక్సిజన్‌ ప్లాంట్లు తదితరాల లభ్యతను ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. ఈ సన్నద్దతపై ప్రతి మూడు నెలలకు ఒకసారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించండి.

వైరస్‌ విస్తృతిపై ప్రజల్లో అవగాహన పెంచండి’’ అని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. దేశంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‌‡్ష పంత్‌ మంత్రికి ఒక ప్రజెంటేషన్‌ చూపించారు. కొత్త జేఎన్‌1 సబ్‌వేరియంట్‌ను ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’ పరిగణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్నా రిస్క్‌ తక్కువేనంది. అమెరికా, చైనా, సింగపూర్, భారత్‌లలో ఈ వైరస్‌ వెలుగు చూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement