రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నేత బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు | Congress Leader Shama Mohamed Fat-Shames Rohit Sharma | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ రోహిత్‌పై కాంగ్రెస్‌ నేత బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్‌

Mar 3 2025 11:32 AM | Updated on Mar 3 2025 12:11 PM

Congress Leader Shama Mohamed Fat-Shames Rohit Sharma

ఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్‌ శర్మపై బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేశారు. రోహిత్‌ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.

దుబాయ్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ రోహిత్‌ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్‌ ఆటతీరుపై కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్‌ వేదికగా రోహిత్‌ను టార్గెట్‌ చేసి.. రోహిత్‌ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్‌ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్‌ భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్‌ రోహిత్‌. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్‌ను సోషల్‌ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ క్రికెట్‌ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. 


ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్‌ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్‌ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఐపీఎల్‌లో కూడా రోహిత్‌ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్‌ చరిత్రలోనే రోహిత్‌కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement