బెంగళూరు: చందమామ ధ్రువపు ప్రాంతాలకు సంబంధించి చంద్రయాన్–2 లూనార్ ఆర్బిటార్ నుంచి విలువైన సమాచారాన్ని సేకరించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ డేటాతో చంద్రుడి వాతావరణం, అక్కడి స్థితిగతుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది.
జాబిల్లి ఉపరితలానికి చెందిన ఫిజికల్, డైఎలక్ట్రిక్ లక్షణాలు తెసుకోవచ్చని పేర్కొంది. భవిష్యత్తులో చంద్రుడిపై చేపట్టబోయే కీలక ప్రయోగాలకు ఈ సమాచారం ఎంతగానో తోడ్పడుతుందని ఇస్రో తేల్చిచెప్పింది.చంద్రయాన్–2 ఆర్బిటార్ 2019 నుంచి చంద్రుడి చుట్టూ కక్ష్యలోకి తిరుగుతోంది. నాణ్యమైన డేటాను భూమిపైకి చేరవేస్తోంది. ఇందులోని డ్యుయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్(డీఎఫ్ఎస్ఏఆర్) అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించింది. ఈ అడ్వాన్స్డ్ రాడార్ సంకేతాలను నిలువు దిశ, అడ్డం దిశల్లో పంపగలదు, స్వీకరించగలదు. చందమామ ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడుతోంది.
చంద్రుడి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువానికి సంబంధించిన సమాచారాన్ని చంద్రయాన్–2లోని 1,400 రాడార్ డేటాసెట్లు సేకరించి, విశ్లేషించాయి. ఈ సమాచారం ఆధారంగా అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్ఏసీ) సైంటిస్టులు అడ్వాన్స్డ్ డేటా ప్రొడక్ట్లను అభివృద్ధి చేశారు. చంద్రుడిపై మంచు రూపంలోని నీరు, ఉపరితలం పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడానికి ఈ ప్రొడక్ట్లు సహకరిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.


