కేంద్రం కీలక నిర్ణయం: పాక్‌ నుంచి మెసేజ్‌లు.. ఆ 14 యాప్స్‌ బ్లాక్‌

Centre Blocks 14 Mobile Apps Amid Pakistan Communications - Sakshi

ఢిల్లీ: అనుమానిత మొబైల్‌ యాప్స్‌ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌లను బ్లాక్‌ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్‌, క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్తాన్‌ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో ఈ యాప్‌ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో.. 

కేంద్రం 14 మెసేజింగ్‌ యాప్‌లను బ్లాక్‌ చేస్తున్నట్లు తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్Wickrme, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్‌, నంద్‌బాక్స్‌, కోనియన్‌, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. 

భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్‌ మేరకు.. ఐటీ యాక్ట్‌ 2000 సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్‌  ప్రతినిధులెవరూ భారత్‌లో లేరని నిర్ధారించుకుంది. మెసేజింగ్‌ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఓ ప్రకటనలో కేంద్రం కోరింది.

ఇదీ చదవండి: మన్‌కీ బాత్‌ టైంలో పురిటి నొప్పులు, ఆపై..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top